ముంభై: అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో క్రూడ్ ఆయిల్ ధరలు మరింత ఎక్కువగా పెరుగుతున్నాయి. ఉత్పత్తికోతలు కొనసాగించాలని, తద్వారా చమురు ధరలు పడకుండా ఈ ఏడాది మొత్తం మద్దతు అందించాలని ఒపెక్ సమావేశంలో నిర్ణయించారు. దీని ప్రభావం వల్ల ముడిచమురు ధర అంతర్జాతీయ మార్కెట్లో గరిష్ఠ స్థాయికి చేరాయి. బ్రెంట్ క్రూడ్ 1.5 శాతం పెరిగి 73.40 డాలర్లను తాకింది. ఒపెక్ సమావేశంలో అన్ని దేశాల మధ్య ఉత్పత్తి కోతకు సంబంధించి ఏకాభిప్రాయం కుదిరిందని సౌదీ ఎనర్జీ మంత్రి ఖలీద్ ఆల్ ఫలిహ్ చెప్పారు. దీంతో పాటు క్రూడ్ నిల్వలను కొంత తగ్గించాలని కూడా నిర్ణయించామన్నారు. అయితే బలహీనంగా ఉన్న మార్కెట్ కుదేలవకుండా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. ఇరాన్పై ట్రంప్ మరింత కఠిన వైఖరికి మొగ్గు చూపుతున్నారు. ట్రంప్నకు పూర్తి సహకారం ఇస్తామని సౌదీ చెబుతోంది. యుద్ధం రాకుండా అడ్డుకోవాల్సిన బాధ్యత ఇరాన్దేనని సౌదీ హెచ్చరించింది. ఈ పరిణామాలన్నీ చమురు ధరను పెంచేవనని నిపుణులు అంటున్నారు.