న్యూఢిల్లీ , ఆగస్టు 28 : జన్ ధన్ ఆధార్, చరవాణులు జామ్ అనుసంధానం, దేశంలో సామాజిక విప్లవానికి నాంది పలికిందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అభిప్రాయపడ్డారు. పేదలకు, ప్రభుత్వానికి, ఆర్థిక వ్యవస్థకు జామ్ ద్వారా కీలక లాభాలు అందుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి జన్ ధన్ యోజన ప్రారంభమై మూడేళ్ళు పూర్తి అయిన సందర్భంగా ఫేస్ బుక్ లో ప్రత్యేక వ్యాసం రాసిన జైట్లీ, ఆ పథకం ద్వారా ఇప్పటి వరకు సాధించిన పురోగతిని ఆర్థిక వ్యవస్థకు కలిగే లాభాలను వెల్లడించారు. జీఎస్టీ అమలు ఏకీకృత విపణీని సృష్టించిన తరహాలో జామ్ ద్వార ప్రారంభమైన సామాజిక ఉద్యమం భారతీయులందరినీ ఉమ్మడి ఆర్థిక డిజిటల్ స్రవంతిలోకి తీసుకొస్తుందని ఆయన మంత్రి విశ్లేషించారు. దేశంలో 100 కోట్ల ఆధార్ సంఖ్యలని 100 కోట్ల బ్యాంకు ఖాతాల్ని , 100 కోట్ల చరవాణుల్ని అనుసంధానం చేసే రోజు అతి చేరువలోనే ఉందని, అదే జరిగితే దేశంలోని ప్రతిఒక్కరూ ఉమ్మడి ఆర్థిక స్రవంతిలోకి వచ్చి లబ్ధి పొందుతారని ఫేస్ బుక్ వ్యాసంలో వివరించారు.