ఇస్లామాబాద్: త్వరలో ఇంగ్లాండ్ వేదికగా ప్రారంభం కానున్న వరల్డ్ కప్ పై దాయాది దేశమైన పాకిస్థాన్ మాజీ కెప్టెన్ జహీర్ అబ్బాస్ పలు సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ....ఈ సారి టోర్నీలో పాకిస్థాన్తో పాటు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్ సెమీఫైనల్కి చేరుకునే అవకాశం ఉంది. ఐతే భారత జట్టును తక్కువ అంచనా వేయలేమని, ఆ జట్టులో నాణ్యమైన ఆటగాళ్లు ఉన్నారని, బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఆ జట్టు సమతూకంగా ఉంది. ఆ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించేది మాత్రం ధోనీనే. భారత జట్టులో ధోని అంత మేధావి అని, ఆ జట్టుకు ఆయన బ్రెయిన్లాంటివాడని, మ్యాచ్ను అర్ధం చేసుకోవడంలో అతను నేర్పరి, అందుకే ఎన్నోసార్లు భారత జట్టును ఛాంపియన్గా నిలిపాడు. అతని అపార అనుభవం కోహ్లి సారథ్యంలోని జట్టుకు ఎంతగానో ఉపయోగపడుతుంది. తొలిసారి సారథ్యం వహిస్తున్న కోహ్లికి ధోని జట్టులో ఉండడం కలిసొచ్చే అంశం, అతని సలహాలతో విరాట్ కెప్టెన్గా మరింత రాటుదేలే అవకాశం ఉంది. ఇంగ్లాండ్లో మైదానాలన్నీ భారీ స్కోర్లకు అనువైనవి, అక్కడ మైదానాల్లోని పిచ్లపై గడ్డి అంతగా ఉండదు. అందుకే బ్యాట్స్మెన్ స్వేచ్ఛగా బ్యాట్ ఝుళిపించవచ్చు అని అబ్బాస్ పేర్కొన్నాడు.