అశ్లీల నృత్యాలు ప్రదర్శించిన కేసులో ఆరుగురికి ఒక్కో నెల జైలు శిక్ష లేదా రూ. 7 వేలు జరిమానా విధిస్తూ కళ్యాణదుర్గం జూనియర్ సివిల్ జడ్జి దీప్తి మంగళవారం తీర్పునిచ్చారు. రూరల్ సీఐ శివప్రసాద్ తెలిపిన మేరకు.. 2014 సంవత్సరం ఫిబ్రవరి నెల 16వ తేదీన కుందుర్పి మండలం అపిలేపల్లిలో ఓ నాటిక సందర్భంగా అశ్లీల నృత్యాలు ప్రదర్శించారు. స్థానికుల ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్ఐ శ్రీనివాసులు నాటికను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఆ గ్రామానికి చెందిన అంగడి తిమ్మప్ప, బోయ నాగరాజు, బోయ తిమ్మరాజు, బోయ చిరంజీవి ఎస్ఐపై దాడిచేసే యత్నం చేశారు. దీంతో ఎస్ఐ అశ్లీల చిత్రాల ప్రదర్శనకు సహకరించిన నలుగురిపై, నాటిక ప్రదర్శన కోసం అనంతపురం నుంచి వచ్చిన నాట్యగత్తెలు సుహాసిని, దివ్యశ్రీలపై కూడా అశ్లీల చిత్రాల ప్రదర్శన చేస్తున్నట్లు కేసు నమోదు చేశారన్నారు. కేసు విచారణలో భాగంగా అశ్లీల చిత్రాలు ప్రదర్శించినట్లు రుజువు కావడంతో స్థానిక జడ్జి దీప్తి ఆరుగురికి ఒక్కో నెల జైలు శిక్ష లేదా రూ. 7 వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారన్నారు.