నంద్యాల, ఆగస్ట్ 28 : నంద్యాల ఉప ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి తన ఓటమిని అంగీకరించారు. అసలు తన ఓటమికి కారణం ఎన్నికల ప్రచార సమయంలో తన అనారోగ్యం కారణంగా సరిగ్గా ప్రచారంలో పాల్గొనలేదని, ఓటమికి ప్రధాన కారణం అదేనని వ్యాఖ్యానించారు. అసలు ఎన్నికల సమయంలో అన్ని నియోజక వర్గాలలోని ప్రజల వద్దకు స్వయంగా వెళ్లాలని అనుకున్నా, అది సాధ్యపడలేద౦టూ ఆయన వెల్లడించారు.
ఎన్నికల కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో టీడీపీ అభివృద్ధి వల్ల గెలవలేదని, డబ్బు అండతో గెలిచిందని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా వైఎస్ జగన్ తన గెలుపు కోరుతూ ఎంతో శ్రమించారని, ఇకపై తన ఆశయ సాధన కోసం కృషి చేస్తానని తెలిపారు.
ఓటమితో కుంగిపోవాల్సిన అవసరం లేదు. పూర్తి ఫలితాలు వచ్చిన తర్వాతనే మీడియాతో సమావేశం అవుతానని వెల్లడించారు. ఇక రాజకీయాల్లో కొనసాగుతానా..? లేక సన్యాసం తీసుకుంటానా..? అనే విషయంపై తర్వాత మాట్లాడతానని ప్రజల తీర్పును గౌరవిస్తానని స్పష్టం చేసారు.