ఇస్లామాబాద్: పాకిస్తాన్ లో ఆర్థిక పరిస్థితులు చాలా దారుణంగా పడిపోయాయి. ఆర్థిక వృద్ధి కూడా దాదాపు సగానికి పడిపోవచ్చనే అంచనాలున్నాయి. పాకిస్తాన్లో డజన్ నారింజ పండ్ల ధర రూ.360గా ఉంది. కేజీ నిమ్మకాయలు, ఆపిల్ పండ్ల ధర రూ.400 చేరింది. డజను అరటి పండ్లు ధర రూ.150గా ఉంది. మటన్ ధర అయితే కేజీకి ఏకంగా రూ.1,100కే ఎగసింది. చికెన్ ధర కూడా రూ.320గా ఉంది. లీటరు పాలు కొనాలంటే రూ.190 పెట్టాల్సిందే. మార్చి నెలతో పోలిస్తే మే నెలలో ఉల్లిపాయల ధర 40 శాతం, టమోట ధర 19 శాతం, పెసరపప్పు ధర 13 శాతం పెరిగింది. అలాగే బియ్యం, నూనె, చక్కెర, వంటి వాటి ధర కూడా 10 శాతం ఎగసింది. అలాగే ఆటో, సిమెంట్, ఫార్మా ప్రొడక్టుల ధరలు కూడా పెరిగే అవకాశముందిన స్థానిక సంస్థలు పేర్కొంటున్నాయి. మరోవైపు పాకిస్తాన్ రూపాయి మే నెలలో 29 శాతం పడిపోయింది. ఆసియా 13 కరెన్సీల్లో ఇదే ఎక్కువగా పడిపోయింది. అమెరికా డాలర్తో పోలిస్తే 153 రూపాయల వద్ద ట్రేడవుతోంది. అలాగే ద్రవ్యోల్బణం పెరుగుదల నేపథ్యంలో అక్కడి సెంట్రల్ బ్యాంక్ కీలక వడ్డీ రేట్లను 12.25 శాతానికి పెంచింది. ఆర్థిక వృద్ధి కూడా 2.9 శాతానికి పడిపోవచ్చని ఐఎంఎఫ్ అంచనా వేసింది. గతేడాది ఆర్థిక వృద్ధి 5.2 శాతంగా ఉంది.