కేంద్ర మంత్రి, బీజేపీ నేత స్మృతి ఇరానీ దేశ ప్రజలకు, ఆ పార్టీ కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. గత ఐదేళ్ళ నుంచి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని, బీజేపీని ఆశీర్వదిస్తున్న లక్షలాది మందికి ధన్యవాదాలు చెప్పారు.
‘‘24 గంటలు గడవవలసి ఉంది. ప్రతి ఓటును చూస్తూ, ప్రతి అంశంపైనా విశ్లేషణను తెలుసుకుంటూ రేపు మనలో అత్యధికులు టీవీ సెట్లకు అతుక్కుపోతాం. దేశవ్యాప్తంగా నా పార్టీని, నా అధినాయకత్వాన్ని లక్షలాది మంది ఆశీర్వదిస్తున్నందుకు ధన్యవాదాలు చెప్తున్నాను’’ అని స్మృతి ఇరానీ ట్వీట్ చేశారు.
‘‘వ్యక్తిగతంగా ఏ పదవినీ, ఏ కీర్తినీ కోరుకొనని కార్యకర్తల పట్టుదల, త్యాగశీలత, కఠోర శ్రమలను చూడటం మా అందరికీ గర్వకారణం. అందరితో కలిసి, అందరి అభివృద్ధికి కట్టుబడిన, హుషారైన నవ భారత నిర్మాణం పట్ల బలమైన ఆకాంక్ష మాత్రమే వారిని నడుపుతోంది’’ అని మరో ట్వీట్లో పేర్కొన్నారు.
కేరళ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో బీజేపీ కార్యకర్తల త్యాగాలను స్మృతి గుర్తు చేశారు. కార్యకర్తలతోపాటు వారి కుటుంబాలు చేసిన త్యాగాలను కొనియాడారు. ప్రాణాలను అర్పించినవారికి శ్రద్ధాంజలి ఘటించడానికి మాటలు చాలవని ఆవేదన వ్యక్తం చేశారు.