న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ లోక్ సభ ఎన్నికల్లో వందకు వందశాతం విజయం సాధిస్తుందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ధీమా వ్యక్తం చేశారు. గురువారం ఎన్నికలు ఫలితాలు వెలువడుతున్న నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ పార్టీ కార్యర్తలను ఉద్దేశించి ట్వీట్ చేశారు. ఎగ్జిట్ పోల్స్ ను చూసి ఎవరూ భయపడొద్దని , అవి తప్పుడు సర్వేలు అని ఆయన పేర్కొన్నారు. వచ్చే 24 గంటల పాటు అప్రమత్తంగా ఉండాలని ఆయన పార్టీ కార్యకర్తలకు సూచించారు. సత్యం కోసం పోరాడుతున్న మనకే విజయం తథ్యమని, నమ్మకంతో ముందుకు సాగాలని, కార్యకర్తల శ్రమ వృథా పోదని ఆయన తెలిపారు. ఆదివారంతో చివరి విడత లోక్ సభ ఎన్నికల పోలింగ్ ముగిసిన విషయం తెలిసిందే. పోలింగ్ ముగిసిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. కేంద్రంలో మళ్లీ బిజెపియే అధికారంలోకి వస్తుందని దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ తేల్చి చెప్పాయి. దీంతో కాంగ్రెస్ కార్యకర్తల్లో ఉత్సాహం నింపేందుకు బుధవారం రాహుల్ ఈ విధంగా ట్వీట్ చేశారు.