సుదీర్మన్ కప్లో భారత్ పేలవ ప్రదర్శన కారణంగా ఇంటిబాట పట్టింది. బుధవారం జరిగిన తమ చివరి గ్రూప్-డి1 మ్యాచ్లో భారత్ 0-5తో చైనా చేతిలో ఓడిపోయి ప్రపంచ మిక్స్డ్ టీమ్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ సుదిర్మన్ కప్ నుంచి లీగ్ దశలోనే భారత్ ఇంటిదారి పట్టింది. క్వార్టర్ ఫైనల్ చేరాలంటే చైనాపై కచ్చితంగా నెగ్గాల్సిన మ్యాచ్లో భారత ఆటగాళ్లు విఫలమయి మూల్యం చెల్లించుకున్నారు. సైనా నెహ్వాల్ సహా భారత షట్లర్లలో ఒక్కరూ గెలవలేకపోయారు.తొలి మ్యాచ్గా జరిగిన మిక్స్డ్ డబుల్స్ మ్యాచ్లో ప్రణవ్-సిక్కిరెడ్డి జోడీ 5-21, 11-21తో వాంగ్-పింగ్యూ జంట చేతిలో ఓడింది. రెండో మ్యాచ్గా జరిగిన పురుషుల సింగిల్స్లో సమీర్ వర్మ 17-21, 20-22తో చెన్లాంగ్ చేతిలో ఓడిపోయాడు. మూడో మ్యాచ్గా జరిగిన పురుషుల డబుల్స్లో సాత్విక్-చిరాగ్ జోడీ 21-18, 15-21, 17-21తో హన్-డాంగ్ జంట చేతిలో ఓడిపోయింది.వరుసగా మూడు మ్యాచులు ఓడడంతో 3-0తో చైనా గెలుపు ఖాయమైంది. నామమాత్రమైన నాలుగో మ్యాచ్గా జరిగిన మహిళల సింగిల్స్లో సైనా 12-21, 17-21తో చెన్ యుఫీ చేతిలో, చివరి మ్యాచ్గా జరిగిన మహిళల డబుల్స్లో సిక్కి-అశ్విని ద్వయం 12-21, 15-21తో చెన్-యిఫాన్ జోడీ చేతిలో ఓడింది.