అరుణగ్రహంలో మన పేర్లు....నాసా స్పెషల్ ఆఫర్

     Written by : smtv Desk | Thu, May 23, 2019, 12:08 PM

అరుణగ్రహంలో మన పేర్లు....నాసా స్పెషల్ ఆఫర్

వాషింగ్టన్‌: అమెరికాకు చెందిన ‘నాసా’సంస్థ ప్రజలకు ఓ ఆఫర్ ప్రకటించింది. 2020లో అరుణగ్రహంపైకి పంపించే రోవర్‌లో ప్రజల పేర్లు కూడా పంపించడానికి నిర్ణయించింది. దీంతో ఇష్టమైనవారు తమ పేర్లను పంపించాలని ఓ ప్రకటనలో కోరింది. రెండు సిలికాన్‌ చిప్‌లపై 20లక్షల మందికిపైగా పేర్లు చెక్కుతామని, జులై 2020న అంగారకుడిపైకి పంపించే సైంటిస్ట్‌ రోవర్‌లో వీటిని పంపిస్తామని పేర్కొంది. ఈ రోవర్‌ ఫిబ్రవరి 2021నాటికి కుజుడిపైకి చేరుతుందని నాసా అంచనా వేస్తోంది. కాలిఫోర్నియాలోని జెట్‌ ప్రొపల్షన్‌ ల్యాబొరేటరీలో ఎలక్ట్రాన్‌ కాంతికిరణాల సాయంతో, ఒక్కో చిప్‌పై మానవ వెంట్రుక వెడల్పులో వెయ్యో వంతు ఉండే అతిచిన్న అక్షరాలు చెక్కనున్నారు. నాసా ప్రయోగించనున్న స్వయంచాలిత రోబో.. శాస్త్రవేత్తలా వ్యవహరిస్తుంది. ఈ రోవర్‌ వెయ్యి కిలోల బరువు ఉంటుంది. అరుణగ్రహం మట్టిలో సూక్ష్మజీవుల ఉనికి ఉందేమో పరీక్షిస్తుంది. అక్కడి వాతావరణం, భూభౌతిక లక్షణాలను అంచనా వేయడానికి వీలుగా మట్టిని సేకరిస్తుంది. దీన్ని భవిష్యత్తులో భూమిపైకి తీసుకొస్తారు. భవిష్యత్తులో మానవులను అంగారకుడిపైకి పంపించడానికి ఈ వివరాలన్నీ ఉపయోగపడనున్నాయి.





Untitled Document
Advertisements