ఇప్పటివరకు జరిగిన ప్రపంచకప్ టోర్నీలో కేవలం రెండు డబుల్ సెంచరీలు మాత్రమే నమోదయ్యాయి. 1975లో తొలి ప్రపంచకప్ సమరం జరిగింది. ఇప్పుడు 2019 ప్రపంచకప్ జరగనుంది. 1975-2015 మధ్య కాలంలో 11 ప్రపంచకప్లు జరగగా.. 2019లో జరిగేది 12వది.అయితే ఆ రెండు సెంచరీలు కూడా విధ్వంసక ఓపెనర్లు క్రిస్ గేల్ (వెస్టిండీస్), మార్టిన్ గుప్తిల్ (న్యూజీలాండ్)లు బాదారు. 2015 ప్రపంచకప్లో భాగంగా జింబాబ్వేతో కాన్ బెర్రాలో జరిగిన మ్యాచ్లో క్రిస్ గేల్ 147 బంతుల్లో 215 పరుగులు చేసాడు. ఇది ప్రపంచకప్లో మొదటి డబల్ సెంచరీ. 1996లో జరిగిన ప్రపంచకప్లో రావల్పిండిలో జరిగిన మ్యాచ్లో దక్షిణాఫ్రికాకు చెందిన గ్యారీ కిరెస్టన్ 188 పరుగులే అప్పటివరకు అత్యధిక స్కోరు. చాలా కాలం తర్వాత రికార్డుని గేల్ అధిగమించాడు. అంతేకాదు వన్డేలో భారత బ్యాట్స్మన్ కాకుండా ఇతర దేశాల బ్యాట్స్మన్ చేసిన డబల్ సెంచరీ కూడా ఇదే.గేల్ అనంతరం న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గుప్తిల్ డబుల్ సెంచరీ మార్కును చేరాడు. 2015 ప్రపంచకప్లో భాగంగా వెస్టిండీస్ జట్టుతో జరిగిన క్వార్టర్ ఫైనల్ పోరులో.. 163 బంతుల్లో 237 పరుగులు చేశాడు. దీంతో ప్రపంచకప్లో డబుల్ సెంచరీ చేసిన రెండో ఆటగాడిగా గుప్తిల్ గుర్తింపు పొందాడు. మరోవైపు గుప్తిల్ కు వన్డేలలో ఇదే అత్యధిక స్కోరు.2010లో దిగ్గజ ఆటగాడు సచిన్ వన్డేలలో తొలి డబల్ సెంచరీ నమోదు చేసాడు. 2011లో టీమిండియా డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ బాదాడు. 2013, 2014, 2017లో రోహిత్ మూడు డబల్ సెంచరీలు కొట్టాడు. ఇక 2018లో పాకిస్థాన్ ఓపెనర్ ఫకర్ జామన్ డబల్ సెంచరీ చేసాడు. 2014లో రోహిత్ కొట్టిన 264 పరుగులే ఇప్పటివరకు వన్డేలలో అత్యధిక స్కోర్. మొత్తానికి వన్డేలలో 8 డబల్ సెంచరీ నమోదు అయ్యాయి.