గువాహటి: ఇండియా ఓపెన్ బాక్సింగ్ టోర్నీలో భారత బాక్సర్లు దూసుకెల్తున్నారు. ప్రపంచ చాంపియన్షిప్ కాంస్య విజేత శివ తాపా, ఆసియా గేమ్స్ స్వర్ణ పతకాధారి అమిత్ పంగల్ సెమీఫైనల్లోకి అడుగు పెట్టారు. బుధవారం జరిగిన పురుషుల 60కిలోల క్వార్టర్స్లో శివ 5-0 తేడాతో హెల్లెన్ డామియన్(మారిషస్)పై అలవోక విజయం సాధించాడు. మూడేండ్ల క్రితం ఇదే వేదికపై జాతీయ చాంపియన్ టైటిల్ను దక్కించుకున్న శివ..ప్రత్యర్థికి ఏ దశలోనూ అవకాశమివ్వలేదు. తన కంటే పొడగరి అయినా వెనకంజ వేయకుండా పదునైన పంచ్లతో విరుచుకుపడ్డాడు. తన కుటుంబ సభ్యులు, స్కూల్ విద్యార్థుల కేరింతల మధ్య సాగిన బౌట్లో శివ తనదైన ఆధిపత్యం కొనసాగించాడు. క్రిస్టియన్ సెజెపాన్స్కీ(పోలండ్)తో తాపా తలపడుతాడు. మరోవైపు 52కిలోల విభాగంలో అమిత్ పంగల్, పీఎల్ ప్రసాద్, సచిన్ సివాచ్, గౌరవ్ సోలంకి ముందంజ వేశారు. 60కిలోల కేటగిరీలో శివతో పాటు అంకిత్, మనీశ్ కౌశిక్ విజయాలతో తదుపరి రౌండ్లో నిలిచారు.