ఈటీవీలో 'జబర్దస్త్' కామెడీ షో ఎంతో పాప్యులర్ అయింది. ఈ కామెడీ షోకి నాగబాబు - రోజా న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల రాజకీయ సంబంధమైన కార్యక్రమాలతో తీరిక లేకుండా ఉండటం వలన ఈ ఇద్దరూ 'జబర్దస్త్' కార్యక్రమంలో కనపడలేదు. ఆ తరువాత రోజా వచ్చేసి మళ్లీ సందడి చేస్తోంది గానీ, నాగబాబు ఇంకా జాయిన్ కాలేదు. ఈ నేపథ్యంలో ఏపీలో ఎన్నికల ఫలితాలు రావడం .. వైసీపీ అత్యధిక మెజారిటీతో గెలవడం జరిగిపోయింది.
జగన్ ముఖ్యమంత్రి అవుతోన్న నేపథ్యంలో రోజాకి మంత్రి పదవి దక్కొచ్చని అంటున్నారు. మంత్రి అయితే ఆమె 'జబర్దస్త్' కార్యక్రమాన్ని వదులుకునే అవకాశం ఉందని చెప్పుకుంటున్నారు. ఇక ఎంపీ అయినా తాను 'జబర్దస్త్' వదులుకోనని ఇంతకుముందే నాగబాబు చెప్పారు. ఆయన ఓడిపోవడంతో ఇక 'జబర్దస్త్' కి రావడం ఖాయమని అంతా అనుకుంటున్నారు. కానీ ఆయన స్థానంలో అలీ వచ్చే అవకాశాలు వున్నాయనే ప్రచారం జరుగుతూ ఉండటం ఆశ్చర్యకరం.