ఇస్లామాబాద్: పాక్ లోని క్వెట్టా నగరంలోని మసీదులో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ఇద్దరు మృతి చెందగా...మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని సంభందిత అధికారులు చెప్పారు. పూర్తి వివరాల ప్రకారం...క్వెట్టా నగరంలోని మసీదులను లక్ష్యంగా చేసుకొని మిలిటెంట్లు పేలుడుకు పాల్పడ్డారు. మసీదులో శుక్రవారం ప్రార్థన చేసేందుకు వచ్చిన పౌరులను లక్ష్యంగా దాడికి వ్యూహ రచన చేశారు. ఈ దాడిలో మసీదు ఇమామ్ సహా ఇద్దరు మృతిచెందారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. అయితే, నమాజ్ ప్రారంభం కాకపోవడంతోనే బాంబు పేలడంతో అపార ప్రాణనష్టం తగ్గిందని ఎస్పీ తెలిపారు. సమాచారం అందుకున్న బాంబు స్క్వాడ్ ఘటనాస్థలికి చేరుకొని మసీదు పరిసరప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నాయి. మసీదు పరిసర ప్రాంతాల్లో బాంబులు అమర్చి ఉండవచ్చునని అనుమానం వ్యక్తం చేశాయి. కాగా, ఈపేలుడుకు బాధ్యత వహిస్తున్నట్టు ఏ ఉగ్రసంస్థ కూడా ప్రకటించుకోలేదు. ఇదిలా ఉండగా, బలూచిస్థాన్ రాజధాని క్వెట్టాలో జనాభా తక్కువ. ఈ ప్రాంతంలో ఇంధన వనరులు అధికంగా ఉన్నాయి. మార్చి12న క్వెట్టా ప్రావిన్స్లో గ్వాదర్ నగరంలోని ఓ విలాసవంతమైన హౌటల్లోకి మిలిటెంట్లు చొరబడి కాల్పులకు తెగబడ్డ సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఐదుగురు మృతిచెందారు.