హైదరాబాద్ సనత్ నగర్ లో దారుణ హత్యలు

     Written by : smtv Desk | Mon, May 27, 2019, 12:29 PM

హైదరాబాద్ సనత్ నగర్ లో దారుణ హత్యలు

హైదరాబాద్‌లో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. సనత్‌నగర్‌లో కట్టుకున్న భార్య, నాలుగేళ్ల కొడుకును దారుణంగా చంపాడో కిరాతకుడు. ఇంట్లోనే ఈ మారణ కాండకి పాల్పడి అక్కడి నుంచి పారిపోయాడు. తల్లీకొడుకుల మృతదేహాలను గమనించిన నిందితుడి తోడల్లుడు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కేసు నమోదు చేసి.. అతడి కోసం గాలింపు మొదలు పెట్టారు. ఉత్తరప్రదేశ్‌లోని దేవారియాకు చెందిన రాజేష్‌ బతుకు దెరువు కోసం భార్య ఊర్మిళ, కొడుకుతో కలిసి 15 రోజుల క్రితమే నగరానికి వచ్చాడు. సనత్‌నగర్‌లో కాపురం పెట్టాడు. ఊర్మిళ సోదరి, భర్త కూడా దగ్గరలోనే నివాసం ఉంటున్నారు. ఇంతలో ఏం జరిగిందో ఏమో భార్య, కొడుకును చంపేసి ఆయన పరారయ్యాడు.

నిన్న మధ్యాహ్నం ఊర్మిళ సోదరి భర్త ఇంటికి రాగా తాళం వేసి ఉంది. రాజేష్‌కు ఫోన్‌ చేసినా అతడు ఎత్తకపోవడంతో రెండు గంటలు వేచిచూశారు. అనుమానంతో స్థానికులతో కలిసి అతడు డోర్ పగులగొట్టగా తల్లీకొడులు ఇంట్లో శవాలై పడి ఉన్నారు. ఊర్మిళను ఇనుప రాడ్డుతో కొట్టి నాలుగేళ్ల కొడుకును బకెట్‌లో ముంచి దారుణంగా హత్య చేశారు.వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్ట్ మార్టమ్ కోసం పంపారు. ఘటనపై కేసు నమోదు చేసి పరారీలో ఉన్న కిషన్ కోసం గాలిస్తున్నారు. కుటుంబ కలహాలతోనే రాజేష్‌ ఈ కిరాతానికి ఒడిగట్టి ఉంటాడని అనుమానిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం భార్యాభర్తల మధ్య మనస్పర్థలు వచ్చినట్లు తెలుస్తోంది. ఇద్దరూ తరచూ గొడవపడుతుండటంతో పెద్దలు వీరి మధ్య రాజీ కుదర్చగా ఊర్మిళ సోదరి సలహాతో బతుకు దెరువు కోసం హైదరాబాద్‌ వచ్చారు. ఇంతలోనే ఈ దారుణం చోటు చేసుకుంది.





Untitled Document
Advertisements