అసెంబ్లీ ఎన్నికల ఘోర పరాజయం టీడీపీని అనేక విధాలుగా దెబ్బ తీసింది. కేవలం 3 ఎంపీ స్థానాలే గెలిచి లోక్ సభలో 12వ స్థానానికి పడిపోయిన టీడీపీ 23 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉండటంతో రాజ్యసభలో రానున్న ఐదేళ్ళలో ప్రాతినిధ్యం కోల్పోనుంది. ఎమ్మెల్యేల కనీస బలం లేకపోవడం వలన ఒక్క ఎంపీని గెలిపించుకునే శక్తిని కూడా టీడీపీకి లేకుండాపోయింది. దీంతో రాజ్యసభలో ఆ పార్టీ కనుమరుగయ్యే పరిస్థితి కనిపిస్తోంది.
ఏపీ కోటాలో నాలుగు రాజ్యసభ స్థానాలు ఉండగా అవన్నీ వైకాపాకే దక్కనున్నాయి. ప్రస్తుతం టీడీపీకి రాజ్యసభలో ఐదుగురు ఎంపీలు ఉన్నారు. వారిలో తోటసీతారామలక్ష్మి పదవీకాలం 2020 ఏప్రిల్ నాటికి, టీజీ వెంకటేష్, సుజనా చౌదరిల పదవీకాలం 2022 జూలై నాటికి, సీఎం రమేష్, కనకమేడల రవీంద్రకుమార్ టర్మ్ 2024 ఏప్రిల్ నాటికి ముగుస్తాయి. 2020లో సీతారామలక్ష్మి స్థానంతో పాటు ఇంకో మూడు స్థానాలు ఖాళీ కానున్నాయి. ఈ నాలుగింటిలో ఒక్క స్థానాన్ని గెలిచే శక్తి కూడా టీడీపీకి లేదు. కాబట్టి వైకాపా తన సంఖ్యా బలంతో నాలుగింటినీ కైవసం చేసుకుకోనుంది.
ఈ ఎన్నికలు పూర్తయ్యాక 2024 నాటికి టీడీపీ ఎంపీలంతా రిటైర్ అయిపోతారు. అప్పుడు రాజ్యసభలో తెలుగుదేశం ప్రాతినిధ్యం కనిపించదు. అసలే ఓటమి పరాభవంలో ఉన్న టీడీపీకి ఈ వార్త మరింత బాధను కలిగించనుంది.