దక్షిణకొరియా, ఆగస్ట్ 29: అమెరికా, దక్షిణకొరియాలను హెచ్చరించే నేపధ్యంలో ఉత్తరకొరియా మిస్సైల్ టెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో దక్షిణకొరియా సంచలన ప్రకటన చేసింది. నేడు సరిహద్దుల్లో బాంబులు వేసేందుకు దేశాధ్యక్షుడు మూన్ జే ఇన్ ఉత్తర్వులు విడుదల చేశారని, ఈ క్రమంలో ఎనిమిది బాంబులను ఉత్తరకొరియా సరిహద్దుల్లో వేసి సత్తా చూపిస్తామనేది ఈ ప్రకటన సారాంశం. అయితే ఎఫ్ 15కే యుద్ధ విమానాల ద్వారా మార్క్ 84 బాంబులను ప్రయోగిస్తామని, తద్వారా తమ దేశ సైనిక శక్తి ఉత్తర కొరియాకు తెలిసొస్తుందనే అభిప్రాయాన్ని వెల్లబుచ్చింది. ఉత్తరకొరియా క్షిపణి ప్రయోగం చేయబోతున్న విషయం తమకు ముందే ఇంటెలిజెన్స్ వర్గాలు తెలియజేసినట్లు దక్షిణకొరియా అధికారి ఒకరు తెలిపారు. ఉత్తరకొరియా క్షిపణి దూసుకు వస్తుండటాన్ని చూసిన జపాన్, తీవ్ర ఆందోళన చెంది, తమ దేశ ప్రజలను ఇళ్లల్లోకి వెళ్లిపోవాలని ప్రకటించింది. అయితే ఈ క్షిపణి జపాన్ అధీనంలో ఉన్న హోక్కాయ్ వెళ్ళి పసిఫిక్ మహా సముద్రంలో నిర్వీర్యమయ్యింది.