న్యూఢిల్లీ, సెప్టెంబర్ 1: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని నియంత్రించే నాస్కామ్ సంస్థ వారు ఒక వినూత్న ప్రయోగానికి తెర లేపారు. ఈ విధానంతో ఇటు విద్యార్థులకు, అటు గ్రామీణ ప్రాంత సినిమా హాళ్ల యాజమాన్యాలకు చాలా ప్రయోజనం ఉండబోతోంది. గ్రామీణ ప్రాంతాల్లో పెద్దగా ఉపయోగంలో లేని సింగిల్ స్క్రీన్ సినిమా హాళ్లలో వీడియోల ద్వారా విద్యా పాఠాలు బోధించేందుకు మానవ వనరుల శాఖ సన్నాహాలు చేస్తోంది. ఒకవేళ ఈ విధానం అమల్లోకి వస్తే ప్రభుత్వ అధికారిక డీటీహెచ్ ఛానల్ అయిన 'స్వయం ప్రభ' ద్వారా 9వ తరగతి నుండి 12వ తరగతి విద్యార్థులకు సినిమా హాల్ వేదికగా పాఠాలు బోధించే అవకాశం ఏర్పడుతుంది. అంతేకాకుండా ఈ విధానంతో ఒకేసారి ఎక్కువ మంది విద్యార్థులకు పాఠాలు వినే సదుపాయం కలుగుతుంది. అయితే వీడియోల్లో ప్రసారం చేయనున్న పాఠాలను ఐఐటీ ప్రొఫెసర్లు, నిపుణుల పర్యవేక్షణలో రికార్డు చేసే ఆలోచనలో మానవ వనరుల శాఖ ఉంది. సినిమా హాళ్ల ద్వారా బోధన థియేటర్ నిరుపయోగంగా ఉండే సమయంలో అంటే ఉదయం 7గం. నుంచి 11గం.ల మధ్య, అలాగే ఆదివారాలు, సెలవుదినాల్లోనూ ఈ పాఠాలు బోధించాలని ప్రతిపాదించారు.