15వ ఏపీ అసెంబ్లీ సమావేశాలు నేడు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఏపీ ముఖ్యమంత్రి జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు సహా పలువురు నేతలు ఎమ్మెల్యేలుగా ఈరోజు ప్రమాణస్వీకారం చేశారు. ఈ సమావేశాల నేపథ్యంలో అసెంబ్లీ లాబీల్లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. అసెంబ్లీలో ప్రమాణస్వీకారం చేసిన టీడీపీ హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఏపీ మంత్రి కొడాలి నానితో సరదాగా ముచ్చటించారు. అనంతరం కొద్దిసేపు చేతిలో చేయి వేసుకుని మాట్లాడారు. అదే సమయంలో మరో టీడీపీ నేత పయ్యావుల కేవశ్ వైసీపీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, కొడాలి నానితో మాట్లాడారు. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.