ఖాట్మండు: ప్రపంచంలోనే ఎత్తైన ఎవరెస్ట్ పర్వతంపై మరణించిన వారు ట్రాఫిక్ జామ్ వల్ల కాదని తాజాగా నేపాల్ సర్కార్ వెల్లడించింది. అత్యంత ఎత్తులో ఉండడంవల్ల కలిగే అనారోగ్యం, ప్రతికూల వాతావరణం, ఆరోగ్య సంబంధమైన ఇతర కారణాల వల్లకూడా మృతి చెందారని పేర్కొంది. ఆ పర్వతంపై ఇదివరకు 11 మంది మరణించారని, అందువల్ల 2015 నుంచి అత్యంత ప్రమాదకరమైన సీజన్గా భావించాలని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. అయితే తొమ్మిది మంది మాత్రమే మరణించారని నేపాల్ టూరిజం తెలిపింది. 8,848 మీటర్ల ఎత్తులో ఉన్న ఎవరెస్ట్పై నలుగురు భారతీయులు మరణించారు.కాంచన గంగ, మకాలు పర్వతాల్లో ఒక్కొక్కదానిపై ఇద్దరేసి మరణించారు. దాంతో మరణించిన భారతీయ పర్వతారోహకుల సంఖ్య ఎనిమిదికి చేరింది. ‘ఎవరెస్ట్ మరణాలపై జాతీయ, అంతర్జాతీ మీడియా ఇచ్చిన తప్పుడు సమాచారంపైనే మనం దృష్టిపెట్టాం. అందరూ ఒకే సమయంలో పర్వతాగ్రాన్ని చేరుకోవాలని ఆతృతపడినప్పుడే ట్రాఫిక్ జాం ఏర్పడుతుంది. అంతేకాక, 8000 మీటర్ల ఎత్తుకు పైన ఉన్న ప్రదేశాన్ని డెత్ జోన్ అంటాం’ అని పర్యాటకశాఖ డైరెక్టర్ జనరల్ దండూరాజ్ ఘిమిరే చెప్పారు.