న్యూఢిల్లీ: ఐఎల్ అండ్ ఎఫ్స్ సంస్థలో తనిఖీలు చేస్తున్న కొద్దీ మోసాలు బయటికొస్తున్నాయి. వీటిపై చేపడుతున్న దర్యాప్తులో డెలాయిట్ హస్కిన్స్ అండ్ సెల్స్, కెపిఎంజి అనుబంధ సంస్థలు 22 ఆడిట్ ఉల్లంఘనలకు పాల్పడినట్టు గుర్తించారు. ఈమేరకు సదరు ఆడిట్ సంస్థలపై ఐదేళ్ల నిషేధం దిశగా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ (ఇన్ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్)లో గతేడాది రుణ సంక్షోభం తలెత్తి డిఫాల్ట్ కాగా, ఈ వివాదం కాస్తా ఇతర ఆర్థిక సంస్థల సంక్షోభానికి దారితీసింది. అయితే ఐఎల్ఎఫ్ఎస్లో మోసం, బాధ్యతారాహిత్యం వంటి ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో విస్తృత స్థాయిలో దర్యాప్తు చేపట్టగా అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మరోవైపు తామెలాంటి తప్పుడు విధానాలు అవలంభించలేదంటూ ఈ రెండు ఆడిట్ సంస్థలు ఆరోపణలను ఖండించాయి. ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ను ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న తర్వాత ప్రభుత్వం దీనికి చెందిన కీలక ఫైనాన్స్ యూనిట్లలో ఒకటై ఐఎఫ్ఐఎన్పై దర్యాప్తు ప్రారంభించింది. ఈ సంస్థకు 200809 నుంచి 201718 మధ్య కాలంలో డెలాయిట్ ఆడిట్ నిర్వహించగా, 201718 నుంచి కెపిఎంజి అనుబంధ సంస్థ బిఎస్ఆర్ అండ్ అసోసియేట్స్ ఆడిట్ నిర్వహిస్తోంది. ఆడిటింగ్ సంస్థలు ఐఎల్ అండ్ ఎఫ్ఎస్కు క్లీన్ ఆడిట్ రిపోర్ట్ను ఇచ్చాయి. ఉద్దేశపూర్వకంగా ఐఎఫ్ఐఎన్ మోసపూరిత నివేదికను వెల్లడించలేదని ఈమేరకు సోమవారం ట్రిబ్యునల్ వద్ద దాఖలు చేసిన 214 పేజీల పిటిషన్లో ప్రభుత్వం పేర్కొంది. దర్యాప్తుపై ఎస్ఎఫ్ఐఒ స్పందిస్తూ.. ఆడిటర్లు తమ విధిని సరిగ్గా నిర్వర్తించడంలో ఘోరంగా విఫలమయ్యారని, ఐఎఫ్ఐఎన్ గ్రూప్ అధికారులతో కుమ్మక్కై వాస్తవాలను బయటికి రానీయకుండా చేశారని పేర్కొంది.