భారత వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోని గ్లోవ్స్ పై క్రికెట్ వర్గాల్లో తీవ్రచర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీపీబీ) అధ్యక్షుడు ఇషాన్ మణి ఈ విషయంపై మీడియాతో మాట్లాడాడు. ఇంగ్లాండ్లో మహాభారతం కోసం ధోనీ వెళ్లలేదు కదా..? అని వ్యంగ్యంగా స్పందించాడు. భారత్, పాక్ మ్యాచ్పై తాజాగా మాట్లాడుతూ ‘వరల్డ్కప్ మ్యాచ్లో పాకిస్థాన్ టీమ్ నుంచి ఎలాంటి గుర్తులు, హావభావాలు ఉండబోవు. పాక్ ఆటగాళ్లు ప్రస్తుతం అక్కడ ఉన్నది కేవలం క్రికెట్ ఆడటానికి మాత్రమే. అంతేతప్ప.. ఎలాంటి సందేశాలు ఇవ్వడానికి కాదు. క్రికెట్ అనేది సహృద్భావ వాతావరణాన్ని నెలకొల్పే సాధనంగా మాత్రమే నేను చూస్తాను. దాన్ని అలానే కొనసాగించాలి కూడా. ఇక భారత్, పాక్ మ్యాచ్ ప్రచారం కోసం బ్రాడ్కాస్టర్ ‘‘స్టార్ స్పోర్ట్స్’’ అతిగా వ్యవహరిస్తోంది. తాము ఇండియన్ బ్రాడ్కాస్టర్ కాదు.. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టోర్నీ బ్రాడ్కాస్టర్ అనే విషయాన్ని గుర్తించుకోవాలి. పాకిస్థాన్కి చెందిన ఓ ఛానల్ కూడా వ్యంగ్యంగా రూపొందించిన ఓ యాడ్ని (అభినందన్పై) నేను చూశా. నిజంగా అతడ్ని ఉద్దేశించి అది చేసుంటే మాత్రం.. అది క్రీడాస్ఫూర్తికి విరుద్ధమే’ అని ఇషాన్ మణి స్పష్టం చేశాడు.