ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసీపీ 151 స్థానాల్లో విజయదుందుభి మోగించిన సంగతి తెలిసిందే. అయితే జగన్ విజయానికి కీలకంగా మారిన నవరత్నాలతో పాటు పలు ప్రచార కార్యక్రమాల రూపకల్పనలో ఐ-ప్యాక్ సంస్థ అధినేత ప్రశాంత్ కిశోర్ కీలకంగా వ్యవహరించారు. క్షేత్రస్థాయిలో ప్రజా వ్యతిరేకత ఉన్న నేతలపై నిర్మొహమాటంగా తన నివేదికను జగన్ కు అందించారు. చివరికి గెలుపు గుర్రాలను బరిలోకి దించిన జగన్ విజయం సాధించారు. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశాంత్ కిశోర్ తో ఒప్పందం చేసుకున్నారని సమాచారం.
టీడీపీని మళ్లీ క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసి అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రశాంత్ కిశోర్ తో చంద్రబాబు ఒప్పందం చేసుకున్నారని సీఎన్ఎన్-న్యూస్18 జర్నలిస్ట్ రిషికా కదమ్ తెలిపారు. కొన్నేళ్ల కాలానికి ఈ ఒప్పందం చేసుకున్నారని చెప్పారు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితంగా ఉన్న టీడీపీ సీనియర్ నేత ఒకరు తనకు ఈ విషయం చెప్పారని పేర్కొన్నారు. అయితే ఈ ఒప్పందం విలువ ఎంత అన్నది మాత్రం రిషికా కదమ్ చెప్పలేదు. కాగా, ఈ వార్తలపై చంద్రబాబు కానీ, టీడీపీవర్గాలు కానీ ఇంతవరకూ స్పందించలేదు.