తమిళ హీరో విశాల్పై నటి వరలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేసింది. తన తండ్రి శరత్ కుమార్ పై విశాల్ విడుదల చేసిన వీడియో ఆమెకు పట్టరానంత కోసం తెప్పించింది. 2015 నడిగర్ సంఘం ఎన్నికల సమయంలో విశాల్కు వరలక్ష్మి తండ్రి, నటుడు శరత్ కుమార్ మధ్య గొడవలు జరిగాయి. అయితే అప్పుడు ఇవన్ని పట్టించుకోని వరలక్ష్మి.. ఇప్పుడు మాత్రం తండ్రి గురించి విశాల్ మాట్లాడిన మాటలను సీరియస్గా తీసుకుంది.
ప్రస్తుతం తమిళ సినీ పరిశ్రమలో ఎన్నికల హడావుడి మొదలైన సందర్భంగా విశాల్ గెలుపు కోసం శరత్ కుమార్ చేసిన తప్పులను ఎత్తిచూపుతూ సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్టు చేశాడు. ఆ వీడియో చూసిన వరలక్ష్మికి కోపం కట్టలు తెంచుకుంది. విశాల్పై ఘాటు వ్యాఖ్యలు చేస్తూ.. సోషల్ మీడియాలో ఓ లేఖ విడుదల చేసింది.
‘విశాల్.. ఇప్పటి వరకు నీపై గౌరవం ఉండేది. ఇప్పుడు అది పోయింది. ఈ సారి ఎన్నికల బరిలో లేని మా నాన్న గురించి ఎందుకు మాట్లాడుతున్నావు. ఒకవేళ నా తండ్రి తప్పు చేసి ఉంటే చట్టం శిక్షించేది. ప్రచారంలో నువ్వు చేసిన మంచి పనులు ఏవైనా ఉంటే అవి చెప్పు. ఇన్నాళ్లుగా స్నేహితురాలిగా నీకు మద్దతిచ్చాను. ఇకపై నా మద్దతు నీకుండదు. నువ్వు నా ఓటును కోల్పోయావ్’ అంటూ వరలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేసింది.