ఏటీఎంలతో ఎన్ని ఇబ్బందులు ఉంటాయో తెలిసిందే. అత్యవసర పరిస్థితుల్లో నగదు అవసరమైనప్పుడు వారు నో క్యాష్ బోర్డు పెట్టడం...అలాగే ఆ మిషన్లు అప్పుడప్పుడు స్ట్రక్ అవ్వడం వంటి అనేక సమస్యలు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ఈ సమస్యలకు చెక్ పెట్టేలా ఆర్బీఐ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాంకులు వాటి ఏటీఎంలను డబ్బులతో నింపకపోతే ఇక పెనాల్టీలు చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే ఆర్బీఐ ఈమేరకు బ్యాంకులను హెచ్చరించినట్లు తెలుస్తోంది. బ్యాంకులు మూడు గంటల కన్నా ఎక్కువసేపు ఏటీఎంలను ఖాళీగా ఉంచూడదు. ఇలా జరిగితే జరిమానాలు కట్టాల్సిందే. చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఏటీఎంలలో డబ్బులు లేకపోవడం ఎక్కువగా చూస్తుంటాం. బ్యాంకులు ఏకంగా కొన్ని రోజుల పాటు వీటిని పట్టించుకోవు. అంటే డబ్బులతో నింపవు. సాధారణంగా ఏటీఎంలలో సెన్సర్లు ఉంటాయి. ఇవి డబ్బులు ఏ రేంజ్లో ఉన్నాయో బ్యాంకులకు తెలియజేస్తాయి. ఇకపోతే ఆర్బీఐ ఇటీవలే ఏటీఎం లావాదేవీలు, చార్జీలపై కమిటీ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.