మరోసారి ప్రోటోకాల్ మరిచిన ఇమ్రాన్....నెటిజన్ల ఫైర్

     Written by : smtv Desk | Fri, Jun 14, 2019, 06:14 PM

మరోసారి ప్రోటోకాల్ మరిచిన ఇమ్రాన్....నెటిజన్ల ఫైర్

పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరోసారి ప్రోటోకాల్ మరిచి దేశాధినేతల పట్ల అగౌరవంగా ప్రవర్తించారు. కిర్గిజిస్తాన్‌ రాజధాని బిష్కెక్‌లో గురువారం షాంఘై సహకార సదస్సుకు హాజరైన పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ సదస్సులో అతిథులను ఆహ్వానించే క్రమంలో కిర్గిజిస్తాన్‌ అధ్యక్షుడు ప్రపంచ దేశాధినేతలకు పేరుపేరునా స్వాగతం పలికారు. ఈ క్రమంలో.. సభాస్థలికి వచ్చే సమయంలో మిగిలిన నేతలంతా నిల్చునే ఉన్నప్పటికీ ఇమ్రాన్‌ ఒక్కరే తన సీట్లో కూర్చుండిపోయారు. తన పేరు పలికినపుడు మాత్రమే నిలబడి అభివాదం చేశారు. ఇమ్రాన్‌ చర్యపై మండిపడిన నెటిజన్లు.. కనీస మర్యాద కూడా పాటించరా అంటూ ఆయనపై మండిపడుతున్నారు. ' పాక్‌ ప్రధానికి ఎవరిని ఎలా గౌరవించాలో తెలియదు. మిగతా వాళ్లంతా నిలబడి ఉండే మీరు మాత్రం కూర్చుంటారా. అందరూ వచ్చేదాకా ఆగలేరా. అంత అహంకారమా' అంటూ కొందరు విమర్శిస్తుండగా...' పాపం.. ఆయనకు ఆరోగ్యం బాగాలేదేమో. కాసేపైన కూర్చోకుండా ఉండలేరు కాబోలు. అర్థం చేసుకోరూ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ఇక ఇటీవల సౌదీ ప్రభుత్వం మక్కాలో నిర్వహించిన అరబ్ దేశాల కూటమి ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ ఇస్లామిక్‌ కోఆపరేషన్‌(ఓఐసీ) సమావేశానికి ఇమ్రాన్‌ హాజరైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సౌదీ రాజు వద్దకు వెళ్లి కరచాలనం చేసి.. అనంతరం రాజు మాట్లాడుతున్నా పట్టించుకోకుండా ఇమ్రాన్‌ ముందుకు కదిలారు. దీంతో ఇమ్రాన్ తీరుపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు.





Untitled Document
Advertisements