బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ మరోమారు తన మానవతా హృదయాన్ని చాటుకున్నారు. మొన్న రైతు కుటుంబాలను ఆర్థికంగా ఆదుకున్న ఆయన తాజాగా జవాన్ల కుటుంబాలకు అండగా నిలిచారు. పుల్వామా ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన సీఆర్పీఎఫ్ అమర జవాన్ల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున నగదును ఆయన గురువారం అందజేశారు. ఈ విషయాన్ని అమితాబ్ బచ్చన్ స్వయంగా తన బ్లాగులో వెల్లడించారు. పుల్వామా ఉగ్రవాద దాడిలో 49 మంది జవాన్లు అమరులయ్యారు.
మొన్నటికి మొన్న అప్పుల్లో కూరుకుపోయిన 2,100 మంది రైతుల రుణాలను ఏక కాలంలో చెల్లించి వారికి అమితాబ్ అండగా నిలిచిన విషయం తెలిసిందే. తాజాగా ఉగ్రదాడిలో అమరులైన జవాన్ల కుటుంబాలకు అమితాబ్ సాయం చేసి సోషల్ మీడియాలో నెటిజన్ల ప్రశంసలు అందుకుంటున్నారు. ఇప్పటికే టాలీవుడ్ యంగ్ స్టార్ విజయ్ దేవరకొండ, అనిల్ కపూర్ తదితరులు భారత్ కే వీర్ నిధికి విరాళాలు అందించి జవాన్ల కుటుంబాలకు అండగా నిలిచారు.