దేశంలోని పది రాష్ట్రాల్లో శనివారం గాలిదుమారంతోపాటు ఉరుములు, మెరుపులతో కూడిన పిడుగులు పడొచ్చునని కేంద్ర వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జమ్మూకశ్మీర్, మధ్యప్రదేశ్, చత్తీస్ ఘడ్, మహారాష్ట్ర, జార్ఖండ్, ఒడిశా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో శనివారం గాలిదుమారంతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ అధికారులు చెప్పారు. ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు కూడా పడవచ్చని అధికారులు హెచ్చరించారు. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు.
సిక్కిం, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో ఆదివారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అసోం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, కొంకణ్, గోవా, కర్ణాటక రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవవచ్చని అధికారులు చెప్పారు. వాయు తుపాన్ ప్రభావం వల్ల ఈ నెల 17 నుంచి 18వతేదీ వరకు అరేబియా సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, దీని ప్రభావం వల్ల గంటకు 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముందని వాతావరణకేంద్రం అధికారులు వివరించారు. జూన్ 17వతేదీ వరకు మత్స్యకారులు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.