ఆదివారం భారత్-పాకిస్తాన్ మధ్య జరగనున్న మ్యాచ్ కు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ప్రకటించింది. వరల్డ్కప్లో ఇప్పటి వరకూ పాకిస్థాన్తో ఆరుసార్లు తలపడిన భారత్ జట్టు.. అన్ని మ్యాచ్ల్లోనూ గెలుపొందిన విషయం తెలిసిందే. ముంబయిలో ఉగ్రదాడి తర్వాత కేవలం ఐసీసీ టోర్నీల్లో మాత్రమే భారత్, పాకిస్థాన్ జట్లు ఢీకొంటున్నాయి. దీనికితోడు ఇటీవల పుల్వామా ఉగ్రదాడి తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న నేపథ్యంలో.. స్టేడియంలో అల్లర్లు జరిగే అవకాశం ఉందని ఐసీసీ అనుమానిస్తోంది. ఈ మేరకు భద్రతాపరమైన సమీక్షని నిర్వహించి.. సూచనలు కూడా చేసినట్లు వార్తలు వస్తున్నాయి. మ్యాచ్ జరగనున్న మాంచెస్టర్ స్టేడియం సామర్థ్యం 20వేలు కాగా.. 4 లక్షల మంది టికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే.