భారత్ వర్సెస్ పాకిస్తాన్ ఆట అనగానే చాలా రసవత్తరంగా వుంటుంది. ప్రపంచకప్ 2019లో భాగంగా ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న ఆ ఉత్కంఠకర ఘట్టం రానే వచ్చింది. మరికొద్దిసేపట్లోనే ఈ రెండు జట్లు తలపడనున్నాయి. ఈ పోరులో టీమిండియా గెలవాలని కోట్ల మంది భారత్ అభిమానులు కోరుకుంటున్నారు. కొందరు భారత్ గెలుపు కోసం పూజలు కూడా చేస్తున్నారు. గోరఖ్పూర్ అభిమానులు ప్రత్యేక హోమం చేసి భారత్ గెలవాలని కోరుకున్నారు. వారణాసిలో గంగానదికి హారతిచ్చి మరీ ఇండియా గెలవాలని మొక్కుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.
వారి పూజలు ఫలించాలని భారత్ అభిమానులు కోరుకుంటున్నారు. ఇప్పటికే రెండు వరుస విజయాలు సాధించిన కోహ్లేసేన పాక్పై గెలిచి తన ఆధిపత్యాన్ని కొనసాగించాలని కోరుతున్నారు. పుల్వామా ఉగ్రదాడి అనంతరం రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ప్రపంచకప్లో పాకిస్థాన్తో మ్యాచ్ను రద్దు చేసుకోవాలని భారత్లో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. కాగా టీమిండియా వీటన్నింటిని పక్కన పెట్టేసి ప్రపంచప్లో అడుగుపెట్టి పోరుకు సై అంది. దీంతో ప్రపంచకప్లో పాకిస్థాన్తో మ్యాచ్ మరింత రసవత్తరంగా మారింది. కాగా, 1992 నుంచి 2015 వరకు ఆరుసార్లు ప్రపంచకప్లో తలపడగా టీమిండియానే గెలిచిన విషయం తెలిసిందే.