ఏపీలో మహిళలను వేధిస్తే కఠిన చర్యలు తప్పవని, తాము తీసుకునే చర్యలను చూసి మిగతావారంతా భయపడేలా చేస్తామని హోమ్ శాఖ మంత్రి మేకతోటి సుచరిత హెచ్చరించారు. ఈ ఉదయం సచివాలయంలోని 2వ బ్లాక్ లో ప్రత్యేక పూజల అనంతరం బాధ్యతలు చేపట్టిన ఆమె మీడియాతో మాట్లాడారు. ఓ దళిత మహిళకు హోమ్ మంత్రిగా బాధ్యతలు ఇచ్చిన సీఎం జగన్ కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
శాంతి భద్రతలు కాపాడే విషయంలో కఠినంగా ఉంటామన్న భరోసాను ప్రజలకు ఇస్తున్నామని ఆమె హామీ ఇచ్చారు. కాలేజీల్లో ర్యాగింగ్ అన్న మాట వినిపించకుండా చేస్తామని, ఆడవాళ్లు భయం లేకుండా పోలీసు స్టేషన్ కు వెళ్లి కంప్లయింట్ ఇచ్చే పరిస్థితి వచ్చేలా చూస్తామన్నారు. మహిళల కోసం ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నెంబర్ ను అందుబాటులోకి తేనున్నామని, నూతనంగా మహిళా బెటాలియన్, గిరిజన బెటాలియన్ ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. పోలీసులకు వీక్లీ ఆఫ్ ను దశలవారీగా అన్ని ప్రాంతాలకూ విస్తరిస్తామని, స్టేషన్లలో మహిళా కానిస్టేబుల్స్ కు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని సుచరిత తెలిపారు.