ఐసీసీ ప్రపంచ కప్లో భాగంగా వెస్టిండీస్, ఇంగ్లాండ్ మధ్య మొన్న జరిగిన మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో వెస్టిండీస్పై ఇంగ్లాండ్ ఘన విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 44.4 ఓవర్లలో 212 పరుగులు చేయగలిగింది. ఆ తరువాత బ్యాంటింగ్కు దిగిన ఇంగ్లాండ్ కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ జోరూట్ వీరోచిత ఇన్నింగ్స్ ఆడి శతకాన్ని పూర్తి చేసుకుని నాటౌట్గా నిలబడ్డాడు. అయితే ఈ మ్యాచ్లో జోరూట్ మరో అద్భుతమైన రికార్డ్ను నెలకొల్పాడు.
ఇంగ్లాడ్ బ్యాట్స్మెన్ జోరూట్ ఈ మ్యాచ్లో ఒకే వన్డేలో శతకం చేయడంతో పాటు రెండు వికెట్లు తీసి రెండు క్యాచ్లు పట్టాడు. అయితే 1996 ప్రపంచకప్ తర్వాత ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్గా రూట్ నిలిచాడు. అప్పట్లో శ్రీలంక ఆటగాడు అరవింద డిసిల్వ లాహోర్ వేదికగా జరిగిన ప్రపంచకప్ ఫైనల్స్లో సెంచరీ చేయడంతో పాటు మూడు వికెట్లు కూడా తీసి, రెండు క్యాచ్లు పట్టాడు. అయితే దీనిపై జోరూట్ మాట్లాడుతూ ఈ రికార్డ్ నెలకొల్పడం మరియు మ్యాచ్ గెలవడం ఎంతో సంతోషంగా ఉందని, జట్టులోని ఆటగాళ్లంతా సమిష్టిగా పోరాడుతున్నామని తప్పకుండా ఫైనల్స్కి వెళ్ళి తీరుతామని అన్నారు.