అదనపు ఆదాయాన్ని సమకూర్చుకోవడంలో భాగంగా రైళ్లలో మాసాజ్ సేవలను ప్రారంభించడానికి భారతీయ రైల్వే సన్నాహాలు చేసింది. ఈ విషయంలో తీవ్ర స్థాయిలో విమర్శలు రావడంతో ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్టు రైల్వే అధికారులు తాజాగా ప్రకటించారు. కాగా.. ప్రయాణికులకు సౌకర్యవంతమైన సేవలను అందుబాటులోకి తేవడంతోపాటు అదనపు ఆదాయాన్ని పొందడం కోసం రైళ్లలో మసాజ్ సేవలు ప్రారంభించాలని రత్లాం డివిజన్ అధికారులు నిర్ణయించారు.
దీనికి సానుకూలంగా స్పందించిన భారతీయ రైల్వే.. దశల వారిగా దేశ వ్యాప్తంగా ఈ సేవలను అందుబాటులోకి తేవాలని భావించింది. ఈ నేపథ్యంలో లోక్సభ మాజీ స్పీకర్ సుమిత్రా మహాజన్, ఇండోర్ ఎంపీ శంకర్ లాల్వానీ మహిళల భద్రత అంశాన్ని ప్రస్తావిస్తూ కేంద్రమంత్రి పీయూష్ గోయల్కు లేఖ రాశారు. దీంతో మసాజ్ సేవల నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు.