ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా కిమిడి కళా వెంకట్రావు స్థానంలో శ్రీకాకుళం ఎంపీ, యువనేత కింజరపు రామ్మోహన్నాయుడిని నియమించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇటీవలి ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నుంచి పోటీ చేసిన కళా వెంకట్రావు ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రామ్మోహన్ నాయుడి పేరు తెరపైకి వచ్చింది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, బీసీలకు పెద్దపీట వేస్తూ ముందుకు సాగుతుండటంతో, పార్టీ అధ్యక్ష పదవిని బీసీలకు ఇస్తే బాగుంటుందని కొందరు నేతల నుంచి వచ్చిన సూచలన మేరకు రామ్మోహన్ నాయుడి పేరును చంద్రబాబునాయుడు పరిశీలించి ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడవచ్చని పార్టీ వర్గాలు అంటున్నాయి.