హైదరాబాద్ లోని జుమ్మేరాత్ బజార్ లో గత రాత్రి జరిగిన ఘటనకు సంబంధించిన సంచలన వీడియోను పోలీసులు విడుదల చేశారు. తనను పోలీసులు తీవ్రంగా కొట్టారని, తలకు గాయమైందని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన ఆరోపణలు అవాస్తవమని, ఆయన తన తలను తానే రాయితో కొట్టుకున్నారని పోలీసులు అంటున్నారు. అందుకు సంబంధించిన వీడియో క్లిప్ ను విడుదల చేశారు. నిన్న రాత్రి స్వాతంత్ర్య సమరయోధురాలు రాణి అవంతిభాయ్ విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు ఓ వర్గం వారు ప్రయత్నించగా, మరో వర్గం వారు అడ్డుకున్న సంగతి తెలిసిందే. ఆ సమయంలో అక్కడికి చేరుకున్న రాజాసింగ్, తన మద్దతుదారులతో కలిసి నిరసన తెలిపారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేయగా, రాజాసింగ్ తలకు గాయాలయ్యాయని తొలుత వార్తలు వచ్చాయి. ఆయనకు ఉస్మానియాలో చికిత్స చేయగా, ఇప్పుడీ వీడియో బయటకు రావడం గమనార్హం.