పదవిలో ఉన్నా అదే దౌర్జన్యపు తీరు.. లేకపోయినా అదే దౌర్జన్యపు తీరు.. ఇది దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వ్యవహారం. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రజలు, ప్రభుత్వ అధికారులు అనే తేడా లేకుండా అందరి మీదా పదవీ ప్రతాపం చూపిన ప్రభాకర్ ఓడిపోయాక కక్ష సాధింపుకు దిగారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసిన పనుల్ని ఇప్పుడు భగ్నం చేస్తున్నారు.
పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా పోలవరం కుడికాలువ నుండి గోదావరి జలాలను దెందులూరు నియోజకవర్గంలోని పంట పొలాలకు అందించడానికి పైప్ లైన్లు వేశారు. ఇవి అప్పట్లో చింతమనేని ప్రభాకర్ ఆధ్వర్యంలోనే జరిగాయి. ఇది ప్రభుత్వ పథకమే అయినా చింతమనేని ఏడాదికి ఒక్కో రైతు నుండి 1000 వసూలు చేసేవారు. రైతులు కూడా మన కోసమే కదా అనుకుంటూ ఇచ్చారు.
కానీ గత ఎన్నికల్లో ఓటమిపాలవడంతో మామూళ్లు రావనుకున్నారో ఏమో చింతమనేని తట్టుకోలేక రెండు రోజుల క్రితం ఉన్నట్టుండి పైపులను చింతమనేని అనుచరులు తొలగించి తీసుకుపోయారు. దీంతో ఆగ్రహించిన రైతులు పోలీస్ కేసు పెట్టారు. పోలీసులు సైతం పదవిలో లేడు కాబట్టి ఎలాంటి ఆటంకాలు లేకుండా చింతమనేని ప్రభాకర్ మీద కేసు నమోదు చేశారు.