ప్రపంచకప్ టోర్నమెంట్లో సెమీ ఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో ఇండియా దారుణంగా పరాజయం పాలు కావడంతో కొందరు మాజీ క్రికెటర్లు పండగ చేసుకుంటున్నారు. ఫైనల్లో ఇక తమకు తిరుగు ఉండదని ఆశిస్తున్నారు. దీనికి అనుగుణంగా వ్యూహాలను రూపొందించుకుంటున్నారు. తాజాగా- ఇంగ్లండ్ క్రికెట్ జట్టు మాజీ కేప్టెన్ మైఖెల్ వాఘన్ ఈ వ్యవహారంలో ఇంకో అడుగు ముందుకేశారు. ఇప్పటికే టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్తో ట్వీట్ల యుద్ధం చేస్తోన్నారు వాఘన్. ఈ సారి ఏకంగా టీమిండియా కేప్టెన్ విరాట్ కోహ్లీని కెలికారు. ఓ చక్రవర్తి చిత్రపటాన్ని మార్ఫింగ్ చేశారు. ఆ చిత్రపటానికి విరాట్ కోహ్లీ తలను అతికించారు. ఓ చేతిలో బాల్, మరో చేతిలో బోర్డింగ్ పాస్ పెట్టారు. టికెట్ ప్లీజ్ అనే కామెంట్ను దీనికి జత చేశారు. ఈ పిక్ను తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. ఇది కాస్తా వైరల్గా మారింది. తమ అభిమాన క్రికెటర్తో ఇలా వెటకారాలు ఆడుతుండటాన్ని చూసి ఎవరు గమ్మున ఉండగలరు? అందుకే- మైఖెల్ వాఘన్పై యుద్ధానికి దిగారు అభిమానులు. ఎడా పెడా కామెంట్స్ చేస్తూ ఆయనను ఏకిపడేస్తున్నారు.