'బిగ్‌బాస్‌' హౌస్ లోకి వెళ్లాలంటే మంచం ఎక్కాల్సిందేనా?

     Written by : smtv Desk | Mon, Jul 15, 2019, 10:33 AM

'బిగ్‌బాస్‌' హౌస్ లోకి వెళ్లాలంటే మంచం ఎక్కాల్సిందేనా?

మరికొన్ని రోజుల్లో ప్రారంభం కాబోతున్న ‘బిగ్ బాస్’ షో వివాదంలో చిక్కుకుంటోంది. షో నిర్వాహకులపై యాంకర్ శ్వేతారెడ్డి ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేయగా, తాజాగా నటి గాయత్రి గుప్తా రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేసింది. బిగ్‌బాస్ షోకి తాను సెలక్టయ్యానని చెప్పి ఏ ప్రాజెక్టులు ఒప్పుకోవద్దన్నారని, దీంతో ఆరు సినిమాల్లో నటించే అవకాశాన్ని వదులుకున్నానని తెలిపింది. తీరా, ఒక రోజు ఫోన్ చేసి సెలక్ట్ కాలేదని చెప్పారని ఆరోపించింది.

బిగ్‌బాస్‌ షోకి రావడానికి సిద్ధమేనా అని రఘు అడిగాడని, వంద రోజులపాటు హౌస్‌లోనే ఉండాల్సి వస్తుందని అన్నారని గాయత్రి గుప్తా తెలిపింది. తాను సరేననడంతో వేరే ప్రాజెక్టులు ఒప్పుకోవద్దన్నారని పేర్కొంది. అభిషేక్, రఘు, రవికాంత్‌లు తన ఇంటికి వచ్చి అగ్రిమెంట్ చేయించుకున్నారని వివరించింది. ఈ సందర్భంగా బిగ్‌బాస్‌లోకి వెళ్లాలంటే పైవారిని ఎలా సంతృప్తి పరుస్తారని రఘు అడిగారని, అలా ఎందుకని తాను ఘాటుగా ప్రశ్నించానని గాయత్రి తెలిపింది.

ఆ తర్వాత ఒకరోజు తనకు ఫోన్ చేసి బిగ్‌బాస్ షోకి ఎంపిక కాలేదని చెప్పారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. షోకు ఎంపిక చేశారన్న ఉద్దేశంతో చేతిలో ఉన్న ఆరు సినిమాలను వదిలేసుకున్నానని వాపోయింది. ఆ నష్టపరిహారం ఇవ్వాల్సింగా షో నిర్వాహకులను అడిగానని, వారి నుంచి సరైన స్పందన రాకపోవడంతోనే పోలీసులను ఆశ్రయించానని గాయత్రి తెలిపింది.





Untitled Document
Advertisements