నా సెల్ ఫోన్ సమాచారాన్ని దోచేశారు - నటి రాధా ప్రశాంతి

     Written by : smtv Desk | Thu, Jul 18, 2019, 11:15 AM

నా సెల్ ఫోన్ సమాచారాన్ని దోచేశారు - నటి రాధా ప్రశాంతి

తనకు తెలియకుండా, తన స్మార్ట్ ఫోన్ లోని కీలకమైన చిత్రాలు, సమాచారాన్ని చోరీ చేశారంటూ సినీ నటి రాధా ప్రశాంతి బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, వివరాలు మీడియాకు అందించారు. సినీ నటిగాను, సామాజిక కార్యకర్తగానూ పనిచేస్తున్న రాధా ప్రశాంతికి గత నాలుగేళ్లుగా డిజైనర్‌ లక్ష్మి అనే మహిళతో పరిచయం ఉంది. ఇటీవల ఆమె తన కుమారుడు చక్రితో కలిసి ప్రశాంతి నివాసానికి వచ్చింది. చీరల డిజైన్లను చూపిస్తానని వారు చెప్పగా, తన వాట్స్ యాప్ కు పంపాలని ప్రశాంతి కోరింది.

ఆ సమయంలో తన ల్యాప్ టాప్ పని చేయడం లేదని చెప్పిన చక్రి, ప్రశాంతి సెల్ ఫోన్ ను తీసుకున్నాడు. ఆపై గంటన్నర తరువాత ఫోన్ తిరిగిచ్చి వెళ్లిపోయాడు. అనంతరం చూసుకుంటే, సెల్ ఫోన్ లోని ముఖ్యమైన ఫొటోలు, విలువైన పత్రాలు, సమాచారం మొత్తం మాయమైంది. ఆపై చక్రికి, లక్ష్మికి ఫోన్ చేయగా, వారు వస్తామని చెప్పి రాలేదు. మరోసారి ఫోన్ చేస్తే సరైన సమాధానం రాలేదు. వారివద్దే తన పాన్ కార్డు, పాస్ పోర్టు రూ. 25 వేల నగదు ఉందని, కేసు నమోదు చేసి, తనకు న్యాయం చేయాలని ఆమె కోరగా, కేసును దర్యాఫ్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.





Untitled Document
Advertisements