రాజశేఖరరెడ్డి నాకు బెస్ట్ ఫ్రెండ్... ఒకే గదిలో పడుకున్నాం!!

     Written by : smtv Desk | Thu, Jul 18, 2019, 12:26 PM

రాజశేఖరరెడ్డి నాకు బెస్ట్ ఫ్రెండ్... ఒకే గదిలో పడుకున్నాం!!

ఏపీ అసెంబ్లీలో కృష్ణానది కరకట్టపై జరిగిన అక్రమ నిర్మాణాల కూల్చివేతపై చర్చ జరుగుతున్న వేళ, రోడ్లపై అడ్డుగా ఉన్న విగ్రహాల ప్రస్తావనను చంద్రబాబు తేగా, సభలో తీవ్ర గందరగోళ పరిస్థితి ఏర్పడింది. వందలాది వైఎస్ విగ్రహాలను అనుమతి లేకుండా పెట్టారని చంద్రబాబు ఆరోపించడంతో సభ దద్దరిల్లింది. చంద్రబాబు సభను తప్పుదారి పట్టిస్తున్నారని, చర్చిస్తున్న విషయాన్ని వదిలేసి, కావాలనే రెచ్చగొడుతున్నారని వైసీపీ సభ్యులు ఆరోపించారు. వైఎస్ విగ్రహాలను చూసి ఆయన కడుపు మండుతోందని మండిపడ్డారు. చంద్రబాబు తన నివాసాన్ని ఖాళీ చేసి, ప్రభుత్వానికి సహకరించాల్సిందేనని అన్నారు.

ఈ గందరగోళం మధ్యే, చంద్రబాబు తన ప్రసంగాన్ని ముగించాలని స్పీకర్ తమ్మినేని సీతారామ్ సూచించిన సమయంలో, ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. "అధ్యక్షా... రాజశేఖరరెడ్డిగారి విగ్రహం... నాకు కడుపు మండేదేంటి అధ్యక్షా. రాజశేఖరరెడ్డి నాకు బెస్ట్ ఫ్రెండ్. చరిత్ర అధ్యక్షా ఇది. మీకు తెలీదా? రాజశేఖరరెడ్డి నాకు ఎంత మంచి స్నేహితుడంటే... మేమిద్దరమూ మంత్రులుగా ఒక రూములో పడుకునేవాళ్లం అధ్యక్షా. అంత క్లోజ్ ఫ్రెండ్. అది జగన్ మోహన్ రెడ్డికి తెలీకపోవచ్చు. 77 - 83... మా ఇద్దరినీ చూసిన వారికి తెలుస్తుంది. మా మధ్య రాజకీయ విరోధం ఉందే తప్ప, వ్యక్తిగత విరోధం లేదు. నేను తెలుగుదేశంలోకి వచ్చాను. ఆయన కాంగ్రెస్ లో ఉన్నారు. రాజకీయంగా పోరాడాం తప్ప, వ్యక్తిగతంగా కాదు" అన్నారు. చంద్రబాబు మాటలను వింటూ జగన్ నవ్వుతుండటం కనిపించింది.





Untitled Document
Advertisements