విండీస్ పర్యటనలో భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, బౌలర్ బుమ్రాకు విశ్రాంతినిచ్చేందుకు బీసీసీఐ నిర్ణయించిన సంగతి తెలిసిందే. కాని ప్రపంచకప్ లో ఘోర పరాజయాన్ని చవి చూసిన తరువాత విరాట్ తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. ఈ మేరకు తాను విండీస్ టూర్కి అందుబాటులో ఉండనున్నట్లు వెల్లడించాడు.ముంబయిలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం సమావేశంకానున్న భారత సెలక్టర్లు.. ఆ వెంటనే జట్టుని ప్రకటించే అవకాశం ఉంది. వెస్టిండీస్తో ఆగస్టు 3 నుంచి మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టుల సిరీస్ని భారత్ జట్టు ఆడనుండగా.. టెస్టులు మినహా వన్డే, టీ20ల నుంచి విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రాలకి విశ్రాంతినివ్వాలని సెలక్టర్లు తొలుత నిర్ణయించారు. కానీ.. టీమ్ సెలక్షన్కి ఒక్కరోజు ముందు కోహ్లీ తాను టూర్కి అందుబాటులో ఉండనున్నట్లు వెల్లడించాడు. అయితే.. జస్ప్రీత్ బుమ్రా మాత్రం విశ్రాంతి కావాలని కోరినట్లు తెలుస్తోంది. ప్రపంచకప్ సెమీస్లో టీమిండియా పేలవ ప్రదర్శన నేపథ్యంలో.. వెస్టిండీస్ టూర్కి జట్టు ఎంపికపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. టోర్నీలో నిరాశపరిచిన మహేంద్రసింగ్ ధోని, దినేశ్ కార్తీక్, కేదార్ జాదవ్ భవితవ్యంపై ఓ నిర్ణయానికి రానున్న సెలక్టర్లు.. గాయపడిన శిఖర్ ధావన్, విజయ్ శంకర్ ఫిట్నెస్పైనా ఆరాతీస్తున్నారు. ఈ ఇద్దరూ ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో ఫిట్నెస్ పరీక్షకి హాజరయ్యారు.