చైనాకు చెందిన రెండు యాప్ సంస్థలు టిక్ టాక్, హలో ప్రపంచాన్ని ఏలుతున్నాయి అంటే నమ్మాల్సిందే. ప్రపంచంలో ఎక్కడ చూసిన వీటి ఊసే. తాజాగా భారత దేశంలో జాతి వ్యతిరేక కార్యకలాపాలకు ఈ రెండు యాప్లు అడ్డాగా మారాయన్న ఆరోపణలపై కేంద్రం స్పందించింది. ఈ మేరకు యాప్ సంస్థలకు 21 ప్రశ్నలతో కూడిన నోటీసులను జారీ చేసింది. సరైన వివరణ ఇవ్వని పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. వివరణలు సమంజసంగా లేకపోతే దేశంలో వీటిని నిషేధిస్తామని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ ఈ నోటీసులు జారీ చేసిందని అధికార వర్గాలు చెప్పాయి. ఈ రెండు యాప్లు జాతీయ వ్యతిరేక కార్యకలాపాలకు కేంద్రంగా మారాయని వాటిని దేశంలో నిషేధించాలని ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ స్వదేశీజాగరణ మంచ్ సభ్యులు ప్రధానికి ఫిర్యాదు చేశారు. ఈక్రమంలో కేంద్రం చర్యలకు సిద్ధపడింది.వాటిమీద వచ్చిన ఆరోపణలపై సమాచార శాఖ వివరణ కోరింది. వీటిలో వినియోగదారులకు సంబంధించిన సమాచారం ప్రస్తుతం గానీ, భవిష్యత్తులో గానీ ఇతర దేశాల వ్యక్తులకు, ప్రైవేటు వ్యక్తులకు బదిలీ చేయమని హామీ ఇవ్వాలని ఆదేశాలు జారీచేసింది.భారత నిబంధనల ప్రకారం 18 ఏళ్లలోపు వారంతా చిన్నపిల్లలే కాబట్టి ఆ లోపు పిల్లలందరినీ దీని నుంచి నిషేధించాలని సూచించింది. ఇతర సామాజిక మాధ్యమాల్లో మార్ఫింగ్ చేసిన రాజకీయ ప్రకటనల కోసం ఈ సంస్థలు డబ్బులు ఖర్చు పెట్టాయని వచ్చిన ఆరోపణలపై కూడా వివరణ ఇవ్వాలని చెప్పింది. రాబోయే మూడేళ్లలో దేశంలో సాంకేతికత అభివృద్ధే లక్ష్యంగా ఒక బిలియన్ డాలర్లను ఖర్చు చేయనున్నట్లు ప్రకటనలో పేర్కొంది.