ఇండోనేసియా ఓపెన్-2019...ఫైనల్లో అడుగు పెట్టిన సింధు!

     Written by : smtv Desk | Sat, Jul 20, 2019, 06:05 PM

ఇండోనేసియా ఓపెన్-2019...ఫైనల్లో అడుగు పెట్టిన సింధు!

ఇండోనేసియా ఓపెన్-2019 టోర్నీలో శరవేగంతో దూసుకెళ్తున్న భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఫైనల్ కు చేరుకుంది. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో చైనీస్ రెండో సీడ్ బ్యాడ్మింటన్ ప్లేయర్ చెన్ యుఫెను 21-19, 21-10 తేడాతో సింధు ఓడించింది. తొలి గేమ్‌లో చైనీస్ షట్లర్ సింధుకు గట్టి పోటీ ఇచ్చింది. వీరిద్దరూ విజయం కోసం హోరాహోరీ పోరాడారు. చివర్లో పుంజుకున్న తెలుగు షట్లర్.. 21-19 తేడాతో తొలి గేమ్‌ను సొంతం చేసుకుంది. రెండో గేమ్‌లో సింధుకు ప్రత్యర్థి పోటీ ఇవ్వలేకపోయింది. 21-10 తేడాతో సింధు సునాయాసంగా గెలుపొందింది. ఈ విజయంతో ఇండోనేసియా ఓపెన్ ఫైనల్ చేరింది. 2018 చైనా ఓపెన్లో తనను ఓడించిన చెన్ యుఫె‌ మీద సింధు ప్రతీకారం తీర్చుకుంది. వీరిద్దరూ ఇప్పటి వరకూ 8సార్లు ముఖాముఖి తలపడగా.. సింధు ఐదుస్లారు గెలవగా, చెన్ మూడుసార్లు విజయం సాధించింది. ఆదివారం జరిగే ఫైనల్లో జపాన్ షట్లర్ యమగుచితో ఐదో సీడ్ సింధు తలపడనుంది. ఫైనల్లో గెలిస్తే.. ఈ ఏడాది సింధు గెలిచిన తొలి టైటిల్ ఇదే అవుతుంది. సెమీస్ చేరే క్రమంలో సింధు.. జపాన్ షట్లర్ నొజోమి ఒకుహరాను 21-14, 21-7 తేడాతో ఓడించింది. యమగుచి టాప్ సీడ్ చైనీస్ తైపీ ప్లేయర్ తైజు యింగ్‌ను 32 నిమిషాల్లోనే ఓడించి ఫైనల్ చేరడం గమనార్హం.





Untitled Document
Advertisements