బెంగళూరు: కర్నాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. వరదలు భారీగా ముంచెత్తడంతో బ్రిడ్జిల పైనుంచి నీరు ప్రవహిస్తోంది. దీంతో వాహనాదారులు బ్రిడ్జి పైనుంచి వెళ్లాలంటేనే వణుకుతున్నారు. బ్రిడ్జిపై వరద నీటిలో అంబులెన్స్ కు ఓ బాలుడు దారి చూపించి గ్రేట్ అనిపించుకున్న సంఘటన కర్నాటకలో చోటుచేసుకుంది. ఓ అంబులెన్స్ ఆరు మృతదేహాలను తీసుకొని వెళ్తుండగా మార్గం మధ్యలో బ్రిడ్జి పైనుంచి వరద పారుతోంది. దీంతో అంబులెన్స్ డ్రైవర్ కు వరద నీటిలో వాహనాన్ని ఎలా నడపాలో అర్థం కాలేదు. కొందరు పిల్లలు ఆడుకుంటుండగా పిలిచి బ్రిడ్జి పై దారి చూపించాలని అడిగాడు. వరద బాగా వస్తోందని తామే రాలేము కొందరు పిల్లలతో పాటు యువకులు సమాధానం ఇచ్చారు. 12 ఏళ్ల వెంకటేష్ అనే బాలుడు తాను దారి చూపిస్తానని చెప్పి వరద నీటిలోకి దిగాడు. వరద నీటిలో తనని ఫాలో కావాలని బాలుడు డ్రైవర్ కు సూచించాడు. అంత వరదలో కూడా ధైర్యం చేసి అంబులెన్స్ కు బాలుడు దారి చూపించాడు. వరద ప్రవాహం దాటగానే వెంకటేష్ ను గ్రామస్థులు మెచ్చుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రాయ్ చూర్ జిల్లాలోని హిరేరాయనకుంపె గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఆ బాలుడు ఆరో తరగతి చదువుతున్నాడు. ఈ వార్త న్యూస్ చానల్ లో హల్ చల్ చేస్తోంది. ట్విటర్ లో నెటిజన్లు వెంకటేష్ కు శౌర్య అవార్డు ఇవ్వాలని కామెంట్లు చేస్తున్నారు.