రిటైర్మెంట్ మళ్ళీ వాయిదానా?

     Written by : smtv Desk | Thu, Aug 15, 2019, 12:20 PM

రిటైర్మెంట్ మళ్ళీ వాయిదానా?

వెస్టిండీస్ విధ్వంసక ఓపెనర్ క్రిస్‌గేల్ మళ్ళీ షాకిచ్చాడు. పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా బుధవారం అర్ధరాత్రి ముగిసిన మూడో వన్డేలో అర్ధశతకం బాదిన క్రిస్‌గేల్ (72: 41 బంతుల్లో 8x4, 5x6).. ఔటైన తర్వాత పెవిలియన్‌కి వెళ్తుండగా.. కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు టీమిండియా ఆటగాళ్లందరూ వచ్చి అతనికి అభినందనలు తెలియజేశారు. దీంతో.. ఇదే క్రిస్‌గేల్‌కి చివరి అంతర్జాతీయ మ్యాచ్‌ అని అంతా భావించారు.సాధారణంగా జెర్సీ ‘నెంబరు 45’తో ఆడే ఈ విధ్వంసక ఓపెనర్ బుధవారం మ్యాచ్‌లో 301 నెంబరు జెర్సీతో మైదానంలోకి దిగాడు. దీంతో.. కెరీర్‌లో 301వ వన్డే ఆడుతున్న గేల్.. వీడ్కోలు వన్డేకి గుర్తుగా ఇలా జెర్సీ నెంబరుని మార్చుకున్నట్లు అంతా భావించి రిటైర్మెంట్ ప్రకటించినట్లు తేల్చేశారు. కానీ.. తాను ఇంకా అంతర్జాతీయ క్రికెట్‌కి వీడ్కోలు చెప్పలేదని తాజాగా క్రిస్‌గేల్ మళ్లీ ట్విస్ట్ ఇచ్చాడు. 2014లో ఆఖరిసారి వెస్టిండీస్ తరఫున టెస్టుల్లో ఆడిన గేల్.. ఐదు రోజుల ఫార్మాట్‌కి ఇంకా రిటైర్మెంట్ ప్రకటించలేదు. అలా అని టెస్టు మ్యాచ్‌లూ ఆడటం లేదు. వాస్తవానికి ఇటీవల ముగిసిన వన్డే ప్రపంచకప్‌తోనే తాను రిటైర్మెంట్ ప్రకటిస్తానని ఈ ఏడాది ఆరంభంలో క్రిస్‌గేల్ వెల్లడించాడు. కానీ.. వరల్డ్‌కప్‌ తర్వాత భారత్‌తో సిరీస్‌ అని మాటమార్చిన ఈ సీనియర్ ఓపెనర్.. తాజాగా మరోసారి వెస్టిండీస్ క్రికెట్ బోర్డుకి షాకిచ్చాడు. ఈ నెల 22 నుంచి భారత్, వెస్టిండీస్ మధ్య రెండు టెస్టుల సిరీస్ ప్రారంభంకానుండగా.. ఈ సిరీస్‌ కోసం క్రిస్‌గేల్‌ని జట్టులోకి వెస్టిండీస్ బోర్డు ఎంపిక చేయలేదు. రిటైర్మెంట్‌పై క్లారిటీ లేకపోవడంతోనే అతడ్ని బోర్డు పక్కన పెట్టినట్లు తెలుస్తోంది.





Untitled Document
Advertisements