'మిషన్ మంగళ్'...రివ్యూ

     Written by : smtv Desk | Thu, Aug 15, 2019, 06:12 PM

'మిషన్ మంగళ్'...రివ్యూ

బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'మిషన్ మంగళ్'. ఈ సినిమా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గురువారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. మిషన్ మంగళ్‌యాన్.. భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం (ఇస్రో) చరిత్రలోనే ఓ అద్భుత ఘట్టం. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష పరిశోధన కేంద్ర నుంచి 2013 నవంబర్ 5న పీఎస్‌ఎల్‌వీ సి-25సి ఉపగ్రహాన్ని అంగారకుడి కక్ష్యలోకి ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. చైనా, జపాన్ దేశాలకు కూడా సాధ్యం కాని అంగారక యాత్రను భారత్ విజయవంతంగా పూర్తిచేసి కొత్త చరిత్రను లిఖించింది. మార్స్ మిషన్‌ను తొలి ప్రయత్నంలోనే కక్ష్యలోకి పంపిన తొలిదేశంగా భారత్ రికార్డుకెక్కింది. ఇది ప్రతి భారతీయుడికి గర్వకారణం. ఇలాంటి గొప్ప ప్రయోగం గురించి, దాని కోసం ఇస్రో శాస్త్రవేత్తలు పడిన కష్టం గురించి దేశ ప్రజలు తెలుసుకోవాలనే సంకల్పంతో దర్శకుడు జగన్ శక్తి ‘మిషన్ మంగళ్’ను తెరకెక్కించారు. భారత చరిత్రలో అద్భుతమైన ఈ అధ్యాయాన్ని పున:సృష్టి చేశారు. స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా ఈ చిత్రం గురువారం విడుదల అయింది. 2010లో ఇస్రోలో రాకేశ్ (అక్షయ్ కుమార్) నేతృత్వంలోని ఒక బృందం రాకెట్‌ను అంతరిక్షంలోకి ప్రయోగించినప్పుడు కథ ప్రారంభమైంది. రాకెట్‌లో సాంకేతిక లోపం ఏర్పడటంతో రాకెట్‌ అంతరిక్షంలోకి వెళ్లే బదులు భూమి వైపు తిరుగుతుంది. దీంతో ఊహించని వైఫల్యంతో ప్రయోగం ముగుస్తుంది. మిషన్ డైరెక్టర్లలో ఒకరైన తారా (విద్యాబాలన్) పర్యవేక్షణలో ఈ ప్రయోగం జరుగుతుంది. మీడియా ఈ వైఫల్యాన్ని విపరీతంగా హైలైట్ చేయటంతో టీమ్ లీడర్ రాకేశ్ వైఫల్యం బాధ్యతను తాను తీసుకుంటాడు. తత్ఫలితంగా, రాకేశ్‌ను ఇస్రో చేపడుతోన్న మార్స్ మిషన్‌కు కేటాయిస్తారు. ఈ సంస్థలోని ఇతర శాస్త్రవేత్తలు అది పనిష్మెంట్ తప్ప మరొకటి కాదని అభిప్రాయపడతారు. కానీ, దేశభక్తి గల రాకేశ్.. తారాతో కలిసి అసాధ్యమనుకున్నదాన్ని సుసాధ్యం చేయాలని నిర్ణయించుకుంటారు. 24 నెలల్లో మార్స్ మిషన్‌ను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టాలనే లక్ష్యంతో పనిచేస్తారు. ఇందుకు సీనియర్లు ముందుకు రాకపోవటంతో ఇస్రోకు చెందిన జూనియర్ శాస్త్రవేత్తల బృందాన్ని తయారు చేసుకుంటారు. MOM బృందంలో తారా, ఎకా (సోనాక్షి సిన్హా), నేహా (కీర్తి కుల్హారీ), కృతిక (తాప్సీ పన్నూ), వర్ష (నిత్యా మీనన్), పరమేశ్వర్ (శర్మన్ జోషి), అనంత్ (హెచ్‌జి దత్తాత్రేయ) సభ్యులు కాగా వారికి సారథిగా రాకేశ్ (అక్షయ్‌ కుమార్‌ ) వ్యవహరిస్తారు. సైన్స్‌లో ఉండే సిద్ధాంతాలు, సమీకరణాలు, సంఖ్యలతో ప్రేక్షకులు గందరగోళం పడకుండా దర్శకుడు సంక్లిష్టమైన విషయాన్ని సులభతరమైన స్క్రీన్‌ప్లేతో చెప్పారు. చిత్ర కథ, అందులోని పాత్రలకు ప్రతి ప్రేక్షకుడు కనెక్ట్ అవుతాడు. పటిష్టమైన పాత్రలతో కథను నడిపించడంతో ప్రేక్షకుడు ఆస్వాదిస్తాడు. మామ్ టీమ్‌లోని సభ్యుల వ్యక్తిగత జీవితాలను ప్రస్తావించడం, దానికి అనుగుణంగా రాసుకున్న స్క్రీన్‌ప్లే సినిమాకు ప్లస్ అయ్యింది. అయితే, మిషన్‌కు సంబంధించిన టెక్నికల్ అంశాల గురించి మరింత లోతుగా చెబితే బాగుండేది. మరీ పైపైనే చెప్పేసినట్టు అనిపించింది. దీనికి తోడు కంప్యూటర్ గ్రాఫిక్స్ కూడా నాసిరకంగా ఉన్నాయి. అయితే.. దేశభక్తిని ప్రేక్షకుడు ఆస్వాదించేలా చేయడం, గర్వంగా తలెత్కుకునేలా చేయడంలో దర్శకుడు సఫలమయ్యారు. అంతర్జాతీయ శాస్త్ర పరిశోధనలో భారతదేశాన్ని ప్రపంచపటంలో నిలపగలిగే మార్స్ ప్రయోగం కోసం తమ మనసుల్ని, ఆత్మలను అంకితం చేసి పట్టుదలతో పనిచేసే శాస్త్రవేత్తలుగా విద్యా బాలన్, అక్షయ్ కుమార్ పోటీపడి నటించారు. సహ నటీనటులు సోనాక్షి, తాప్సీ, నిత్య తదితరులు కూడా తమ భావోద్వేగ నటనతో ప్రేక్షకులను మెప్పించారు. అతిథి పాత్రలో సంజయ్ కపూర్ మెప్పించగా.. నాసా-రిటర్న్ సైంటిస్ట్‌గా సగం-అమెరికన్, సగం-ఇండియన్ యాసతో నటించిన దలీప్ తాహిల్ తన పనికిమాలిన సలహాలతో నవ్వులు పూయించాడు. కళా దర్శకుడు ఆర్ బాల్కి, క్రియేటివ్ డైరక్టర్ జగన్ శక్తి మంగళ్‌యాన్‌ ప్రయోగం సమయంలో శాస్త్రవేత్తలకు ఎదురైన సవాళ్లు, వారు ఎదుర్కొన్న భావోద్వేగాలను కళ్లకు కట్టారు. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని చివరికి భారత శాస్త్రవేత్తలు మంగళ్ యాన్‌ను కక్ష్యలోకి ప్రవేశపెట్టినప్పుడు మన దేశం సాధించిన విజయం చూసి మనకూ ఉద్వేగం, ఉత్సాహం కలుగుతాయి. అంతరిక్ష రంగంలో భారత సత్తాను ప్రపంచానికి చాటి చెప్పి భారతీయుల కలను సాకారం చేసిన మంగళ్‌ యాన్‌ మిషన్‌‌తో తామూ మమేకం అయిన భావంతో ప్రేక్షకుడు థియేటర్‌ నుంచి బయటకు వస్తాడు.





Untitled Document
Advertisements