కృష్ణా నదికి వరద పోటెత్తడంతో కరకట్ట మీదనున్న బాబు నివాసం వరద నీటిలో మునుగిపోయిందని ఒక వర్గం మీడియాలో ప్రచారం మొదలయ్యింది. ఈ వ్యవహారంపై అధికార వైసీపీ-ప్రతిపక్షం టీడీపీ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. చంద్రబాబు నివాసం కృష్ణాకు వచ్చిన వరదతో మునిగిపోయిందని వైసీపీ చెబుతుంటే లేదు జగన్ పార్టీ కావాలనే తప్పుడు ప్రచారం చేస్తోందని టీడీపీ ఆరోపిస్తోంది. పులిచింతల నుండి వరద నీరు భారీగా చేరినప్పటికీ ప్రకాశం బ్యారేజీ గేట్లు ఎత్తకుండా బాబు ఇంట్లోకి నీళ్లు వెళ్లేలా చేశారని విమర్శిస్తోంది. ఆ వంకతో బాబు ఇంటిని ఖాళీ చేయించే ప్రయత్నం చేసిందని ఆరోపిస్తోంది. అయితే అసలు ఈ ఇల్లు మునిగిదా లేదా అని తెలుసుకునే ప్రయత్నం చేయగా చంద్రబాబు నివాసంలోకి నీళ్లు చేరే పరిస్థితి వస్తే విజయవాడ లోపలి అంటే కృష్ణలంక వంటి ప్రాంతాలు పూర్తిగా నీట మునుగుతాయని అంటున్నారు.
అంత వరద అయితే ఈ మధ్యకాలంలో ఎప్పుడూ రాలేదు 2009లో మాత్రం ఎనిమిది లక్షల క్యూసెక్కుల వరద నీరు రావడంతో కర్నూలు ప్రాంతం మొత్తం మునిగిపోయింది.. కానీ విజయవాడకు నష్టం ఏమీ జరగలేదు. అయితే ఇప్పుడు రాజధాని నిర్మిస్తున్న అమరావతిలో 29 గ్రామాల్లోకి భారీగా వరద నీరు చేరింది. కొండవీడువాగు, పాలవాగులు తీవ్రంగా పొంగిపొర్లడం ఆ వాగులోకి వచ్చిన నీరు బకింగ్ హామ్ కెనాల్లోకి వెళ్లే అవకాశం లేక నీరు ఎదురు తన్నడంతో ఆ పరిస్థితి ఏర్పడింది. అయితే ఇప్పుడు ఉన్న నీటి కంటే ఇంకా కనీసం 2 మీటర్లు అంటే కనీసం మరో 6.5 అడుగులు మట్టం పెరిగితే కానీ చంద్రబాబు ఇంటి పరిసరాల్లోకి నీరు చేరే అవకాశం లేదనే వాదన వినిపిస్తోంది. ఎందుకంటే కృష్ణా కరకట్టపై అక్రమ కట్టడాలు నిర్మించిన యజమానులు కూడా వరదను ముందుగానే ఊహించి నది వరద వచ్చినపుడు ఎంతవరకూ నీరు చేరుతుందో ఊహించి అంతకన్నా ఎక్కువ ఎత్తులో మట్టి, రాళ్లతో నింపి తర్వాత దానిపై గెస్ట్ హౌస్లు కట్టారు.