భారత్ జట్టు యువ బ్యాట్స్మెన్ శ్రేయాస్ అయ్యర్పై కెప్టెన్ విరాట్ కోహ్లి ప్రశంసల వర్షం కురిపించాడు. అతన్ని చూస్తుంటే ఒకప్పటి తనని తాను చూసుకున్నట్లు ఉందని చెప్పుకొచ్చిన విరాట్ కోహ్లి.. మ్యాచ్ గమనానికి అనుగుణంగా శ్రేయాస్ అయ్యర్ ధైర్యంగా ఆడుతున్నాడంటూ కితాబిచ్చాడు. వెస్టిండీస్తో ఇటీవల ముగిసిన వన్డే సిరీస్లో విరాట్ కోహ్లీ (120, 114 నాటౌట్) వరుసగా రెండు శతకాలు సాధించగా.. శ్రేయాస్ అయ్యర్ (71, 65 పరుగులు) కూడా వరుసగా రెండు హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. ఈ జోడీ.. రెండో వన్డేలో 125 పరుగులు, మూడో వన్డేలో 120 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో.. భారత్ జట్టు అలవోక విజయాల్ని అందుకుంది. దీంతో.. శ్రేయాస్ అయ్యర్కి ఇక వన్డే జట్టులో స్థానం సుస్థిరంకానుందని వార్తలు వస్తున్నాయి. శ్రేయాస్ అయ్యర్ బ్యాటింగ్పై విరాట్ కోహ్లీ మాట్లాడుతూ ‘భారత్ జట్టులోకి అరంగేట్రం చేసిన సమయంలో నేను కూడా శ్రేయాస్ అయ్యర్లానే ఆడేవాడ్ని. ఏ చిన్న అవకాశం దొరికినా.. జట్టుని గెలిపించాలనే కసి, తపన నాలో ఉండేది. రిస్క్ తీసుకోవడంతో పాటు మ్యాచ్ గమనానికి అనుగుణంగా ఆడటం, ఒత్తిడిలో తెగువ చూపడం ఇవన్నీ శ్రేయాస్ అయ్యర్లో నేను చూశా’ అని విరాట్ కోహ్లీ వెల్లడించాడు.