ప్రముఖ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ తమ ఉద్యోగుల విషయంలో సంచలన నిర్ణయం ప్రకటించేందుకు సిద్దమవుతుంది. ఖర్చులను తగ్గించుకునే పనిలో భాగంగా భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలిగించడానికి కార్యచరణ సిద్ధం చేస్తోంది. ప్రధానంగా సంస్థలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్నవారిని లక్ష్యంగా చేసుకున్నట్లు సమాచారం. మరోవైపు ఉద్యోగులకు ఇచ్చే ఇంక్రిమెంట్ల విషయంలోనూ కఠినవైఖరిని అవలంబిస్తోందని.. ఇందులో భాగంగానే సరైన సామర్థ్యం కనబరచని వారితో పాటు.. ఏ ప్రాజెక్టు లేని ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు ఇవ్వడం లేదని తెలుస్తోంది. సంస్థ వ్యయాలను తగ్గించుకుంటూ.. ఆర్థిక వృద్ధిని పెంచే విధంగా కొత్త సీఈఓ బ్రైన్ హంపైర్స్ చేపడుతున్న చర్యల్లో భాగంగా కాగ్నిజెంట్ సంస్థ ఉద్యోగులను తొలగించడానికి సమాయత్తమవుతోంది. ఖర్చులను తగ్గించుకోవడంతో పాటు.. పెట్టుబడులపై దృష్టి పెట్టబోతున్నామని.. తద్వారా కాగ్నిజెంట్ బలమైన వృద్ధి రేటును తిరిగి పొందగలదని.. మేలో జరిగిన ఓ కాన్ఫరెన్స్లో బ్రైన్ హంపైర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. మార్కెటింగ్, డిమాండ్ ఉత్పత్తి, భాగస్వామ్యాలు, పునర్మిర్మాణం, అమ్మకాల కవరేజ్, ఆటోమేషన్ రూపాల్లో పెట్టుబడులను ఆకర్షిచంచవచ్చని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు వ్యయ నియంత్రణ కోసం ఉద్యోగులపై వేటు పడనుంది. సంస్థ తీసుకుంటున్న ఈ చర్యలు ప్రాంగణ నియామకాల్లో ఎంపికై, ఆఫర్ లెటర్లు పొందిన వారిపై కూడా పడింది. ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ కొలిక్కి వచ్చేవరకు ఫ్రెషర్స్ను విధుల్లోకి తీసుకునే అవకాశాలు కనబడటం లేదు.