న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తమ పథకాలకు ప్రాచుర్యం కల్పించడానికి స్థానిక భాషలపై దృష్టి పెడుతోంది. ఆయా రాష్ట్రాల ప్రజలను ఆకట్టుకునేలా వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది బిజెపి. ఇందులో భాగంగానే కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ ఇటీవల తెలుగులో ట్వీట్ చేశారు. ”కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేస్తున్న ‘సమర్ధ్’ పథకం కింద ఆంధ్ర ప్రదేశ్ లో 12,000 మంది యువతకు దుస్తుల తయారీ లో నైపుణ్యాలను పెంపొందించుకొనేందుకు శిక్షణ ఇస్తారు” అని ఆమె తెలిపారు. వీరికి ఉపాధి కల్పించేందుకు కేంద్ర జౌళీ పరిశ్రమ శాఖ కృషి చేస్తోందన్నారు. ఈ పథకాన్ని ఇప్పటికే 16 రాష్ట్రాల్లో అమలు చేస్తున్నామని చెప్పారు. ఈ మేరకు స్మృతీ ఇరానీ తన ట్వీట్టర్ ద్వారా ఓ వీడియోను విడుదల చేశారు. ఆమె తెలుగులో చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.